బీజేపీలోకి మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ?, ఆ వార్త నిజం కాదు: బీజేపీ
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్, క్రికెట్ కామేంటేటర్ సౌరభ్ గంగూలీ బీజేపీలో చేరనున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. గురువారం బీజేపీ పెద్దలతో సమావేశమైన సౌరభ్ గంగూలీ వారితో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. చర్చలు సఫలమైతే గంగూలీ బీజేపీలోకి చేరడం ఖాయమని భావిస్తున్నారు.
భారత క్రికెట్లో తన కంటూ ఓ ప్రత్యేక స్ధానాన్ని సంపాదించుకున్నాడు దాదా. 2014లో జరిగిన సాధారణ ఎన్నికల ముందు కూడా గంగూలీ బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా సౌరభ్ రాజకీయాల్లోకి వస్తారని వార్తలు వస్తున్నప్పటికీ ఖండిస్తూ వచ్చాడు.
రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని కూడా స్పష్టం చేశాడు. గత ఏడాది సాధారణ ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన ఎంపీ సీటును సౌరభ్ గంగూలీ సున్నితంగా తిరస్కరించాడు. 2008లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న దాదా బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ కీలక సభ్యుడిగా ఉండటమే కాకుండా క్రికెట్ కామేంటేటర్గా మారాడు.
ప్రధానమంత్రి మోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో సౌరభ్ను డిసెంబర్ 2014న నామినేట్ చేశారు. స్వచ్చ్ భారత్ లో పాల్గొనాలని ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపుకు గంగూలీ స్పందిస్తూ ప్రధాని ఆహ్వానం మేరకు స్వచ్చ్ భారత్లో పాల్గొంటానని కాని రాజకీయాలలోకి మాత్రం రానని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
గంగూలీ బీజేపీలో చేరుతారన్న వార్త నిజం కాదు: బీజేపీ
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ బీజేపీలో చేరుతున్నారంటూ వస్తున్న వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని బీజేపీ తేల్చి చెప్పింది. బీజేపీ జాతీయ సెక్రటరీ సిద్దార్ధ నాథ్ సింగ్ గురువారం ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు.
బీజేపీలోని కొంత మంది నాయకులు ఆయనతో మంచి సంబంధాలు కలిగి ఉన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. బీజేపీలో చేరే విషయమై ఆయనతో ఎలాంటి చర్చలు జరగలేదని స్పష్టం చేశారు.