ఆ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ కు కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్: వీరప్పన్ ను మట్టుబెట్టడంతో..!
న్యూఢిల్లీ: ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కే విజయ్ కుమార్ కు కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ ను ఇచ్చింది. ఆయనను సీనియర్ భద్రతా సలహాదారునిగా నియమించింది. ఈ మేరకు శుక్రవారం ఉదయం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. అత్యంత సమస్యాత్మకమైన రాష్ట్రాల్లో అవాంఛనీయ సంఘటనలను అరికట్డానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయన దృష్టి సారించాల్సి ఉంటుంది. ఏడాది పాటు ఆయన ఈ హోదాలో కొనసాగుతారు.
Encounter: ఇలాంటి ఎన్ కౌంటర్లు అత్యాచారాలను ఆపుతాయా?: గుత్తా జ్వాలా
Recommended Video
వీరప్పన్ ను మట్టుబెట్టడంతో..
కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దుల్లోని దట్టమైన అటవీ ప్రాంతాలను కేంద్ర బిందువుగా చేసుకుని దశాబ్దాల పాటు ఆధిపత్యాన్ని చలాయించిన స్మగ్లర్ వీరప్పన్ ను మట్టు బెట్టింది ఆయనే. వీరప్పన్ ను అంతమొందించడానికి ఏర్పాటైన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ అధినేతగా వ్యవహరించారు విజయ్ కుమార్. చీమ చిటుక్కుమన్నా పసిగట్టే సామర్థ్యం ఉన్న వీరప్పన్ కోసం చేపట్టిన ఆపరేషన్ కుకూన్ విజయవంతంగా ముగించారు. ఆ ఉదంతం అనంతరం షార్ప్ షూటర్ గా, ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా విజయ్ కుమార్ పేరు మారుమోగిపోయింది.
జమ్మూ కాశ్మీర్ లో అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో..
1975 తమిళనాడు బ్యాచ్ ఐపీఎస్ అధికారి విజయ్ కుమార్.. వీరప్పన్ ఉదంతం తరువాత విజయ్ కుమార్ కేంద్ర సర్వీసులకు వెళ్లారు. జమ్మూ కాశ్మీర్ లోని సమస్యాత్మక ప్రాంతాల్లో సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) చీఫ్ గా పని చేశారు. జమ్మూ కాశ్మీర్ స్థితిగతులపై ఆయనకు పూర్తి అవగాహన ఉంది. ఇప్పుడు అదే ఆయనకు ఈ పదవిని తెచ్చి పెట్టింది. విజయ్ కుమార్ కు ఉన్న ట్రాక్ రికార్డను చూసి, కేంద్రం ఆయనను సీనియర్ భద్రతా సలహాదారుగా నియమించిందని అంటున్నారు.
జమ్మూ కాశ్మీర్ సహా, సమస్యాత్మక రాష్ట్రాలపై నిఘా..
జమ్మూ కాశ్మీర్ సహా దేశంలోని సమస్యాత్మక, సున్నిత రాష్ట్రాలపై నిఘా వేయడంలో ఆయన విధి నిర్వహణలో ఓ భాగమని చెబుతున్నారు. అవాంఛనీయ సంఘటనలు అధికంగా చోటు చేసుకోవడం, మావోయిస్టల ప్రాబల్యం అధికంగా ఉన్న రాష్ట్రాల నుంచి పక్కా సమాచారాన్ని తెప్పించుకోవడం ఆయన విధి. ఆయా రాష్ట్రాల్లో తలెత్తే అవాంఛనీయ, అసాంఘిక సంఘటనలను ఎలా పరిష్కరించాలనే అంశాన్ని విశ్లేషించి, కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు అవసరమైన సలహాలను ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు.