బీజేపీలోకి ఇస్రో మాజీ చీఫ్ మాధవన్ నాయర్: శబరిమల వివాదం, కేరళ ప్రభుత్వం తీరు!
తిరువనంతపురం: ఇస్రో మాజీ చీఫ్ మాధవన్ నాయర్ ఎట్టకేలకు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇస్రోలో ఎన్నో ప్రయోగాలు విజయవంతం కావడానికి తీవ్రస్థాయిలో కృషి చేసిన మాధవన్ నాయర్ ఇక ముందు ఆయన సేవలు బీజేపీకి అందించనున్నారు. శబరిమల వివాదంలో కేరళ ప్రభుత్వం తీరుపై మాధవన్ నాయర్ మండిపడుతున్నారు.
ఇస్రో మాజీ చీఫ్ మాధవన్ నాయర్ తో పాటు తిరువాంకూర్ దేవస్థానం మండలి (టీడీబీ) అధ్యక్షుడు, కేపీసీసీ వర్కింగ్ కమిటీ సభ్యుడు జి. రమణ్ నాయర్, మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు డాక్టర్ ప్రమీళా దేవీ, జేడీఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కరాకులం దివాకరన్ నాయర్, మలాంకర చర్చ్ కు చెందిన థామస్ జాన్ తదితరులు బీజేపీలో చేరారు.
కేరళలోని కర్ఱూరులో జరిగిన ఓ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఇస్రో మాజీ చీఫ్ మాధవన్ నాయర్ తదితరులు ఆ పార్టీలో చేరారు. శబరిమల దేవాలయం వివాదంలో కేంద్రం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు వీరందరూ ఇంతకాలం మద్దతు తెలిపారు.
ఈ సందర్బంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మీడియాతో మాట్లాడుతూ కేరళ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. శబరిమల వివాదంపై పోరాటం చేస్తున్న స్వామి భక్తులను పిణరయి విజయన్ ప్రభుత్వం అరెస్టులు చేస్తోందని అమిత్ షా ఆరోపించారు.
శబరిమల అయ్యస్వామి భక్తుల మీద ఇలాంటి చర్యలు కొనసాగితే కేరళలోని పిణరయి విజయన్ ప్రభుత్వం ఎక్కువ కాలం అధికారంలో ఉండదని అమిత్ షా జోస్యం చెప్పారు. ఇస్రో మాజీ చీఫ్ మాధవన్ నాయర్ సేవలు బీజేపీకి ఎంతో అవసరం అని అమిత్ షా అభిప్రాయం వ్యక్తం చేశారు.