జమ్ము కాశ్మీర్లో మాజీ యువత ఐఏఎస్ అధికారి కొత్త పార్టీ: ఏం చెప్పాడంటే?
శ్రీనగర్: కాశ్మీర్కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి షా ఫైజల్ కొత్త పార్టీ పెట్టనున్నట్లు తెలిపారు. అతను కొద్ది రోజుల క్రితం తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఇప్పటికే ఎన్నికల సంఘం వద్ద కొత్త పార్టీ నమోదు కోసం దరఖాస్తు చేసినట్లు ఓ ఇంటర్వూలో తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని, వేరే ఏ ఇతర పార్టీల్లో చేరే ఉద్దేశం తనకు లేదని, అందుకే సొంతంగా పార్టీని నెలకొల్పాలనుకుంటున్నానని చెప్పారు.
పార్టీ పేరు ఏమిటో చెప్పాలనని అడగగా, దానికి ఎన్నికల కమిషన్ ఆమోదముద్ర వేయాలని, అందుకు సంబంధించిన ప్రతిపాదన కూడా పంపించానని షా ఫైజల్ తెలిపారు. మరికొన్ని రోజుల్లో పార్టీ విషయంపై స్పష్టమైన ప్రకటన చేస్తానని తెలిపారు. అందుకే పార్టీ పేరు ప్రకటించేందుకు తనకు మరికొంత సమయం కావాలని చెప్పారు.
ఎవరీ ఫైజల్?
2009 సివిల్ సర్వీసెస్ పరీక్షలో జమ్మూ కాశ్మీర్ నుంచి మొదటి ర్యాంకు సాధించిన వ్యక్తి షా ఫైజల్. ఇక జమ్ము కాశ్మీర్ నుంచి తొలి ర్యాంకు సాధించడంతో ఆయన ప్రతి రాజకీయ పార్టీ నేతలచే కొనియాడబడ్డాడు. ఆయన్ను పొగడ్తలతో ముంచెత్తని రాజకీయనాయకుడంటూ ఎవరూ లేరు. అంతేకాదు షా ఫైసల్ యువతకు స్ఫూర్తి అని ప్రశంసించారు. అయితే ఫైజల్ ఇటీవల తన పదవికి రాజీనామా చేశారు. అంతకుముందు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురిపించారు. తన రాజీనామాకు కారణాలను వెల్లడించారు.
ఐఏఎస్గా ఎంపిక అయిన తర్వాత ఫేసల్ పాఠశాల విద్యాశాఖ డైరెక్టరుగా ప్రభుత్వం నియమించింది. స్వతహాగా వైద్యుడైన ఫైసల్ అంతకుముందు జమ్మూకశ్మీర్ పవర్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఎండీగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత హార్వర్డ్ యూనివర్శిటీకి ఉన్నత విద్యను అభ్యసించేందుకు వెళ్లారు. ఈ మధ్యే తాను చదువులను పూర్తి చేసుకుని తిరిగి భారత్కు వచ్చారు. వచ్చిన వెంటనే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
కాశ్మీర్లో ప్రజలను అన్యాయంగా చంపడాన్ని ప్రశ్నించారు ఫైసల్. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ మరణాలపై ఎలాంటి చర్యలు లేవని ఆరోపించారు. అందుకే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాశ్మీరీల జీవితాలకంటే తన ఉద్యోగం ముఖ్యం కాదన్నారు. కుప్వారాలోని లోలబ్ లోయ నుంచి వచ్చిన ఫైసల్ దక్షిణాసియాకు సంబంధించి ఓ వివాదాస్పదమైన ట్వీట్ చేసి వార్తల్లో నిలిచాడు. దక్షిణాసియాలో అత్యాచారాలు పెరిగిపోయాయని ధ్వజమెత్తారు. అదే సమయంలో దక్షిణాసియాను "రేపిస్తాన్"గా అభివర్ణించారు. ఫైసల్ వ్యాఖ్యలపై విచారణ జరపాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒక ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి ఇలాంటి ట్వీట్లు పోస్టు చేయడం సరికాదని సీరియస్ అయ్యింది. అయితే తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని చెప్పుకొచ్చారు ఫైసల్.
తనపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం పంపిన ఆదేశాల కాపీని కూడా ట్విటర్లో పోస్టు చేశాడు ఫేసల్. ప్రభుత్వం తనకు రాసిన లవ్లెటర్గా పేర్కొన్నాడు. నిరంకుశత్వంతో విధులు నిర్వహించడం ప్రజాస్వామ్య దేశంలో తగదని చెబుతూ.. గ్రామీణ ప్రాంతంలో మార్పు రావాల్సిన సమయం ఆసన్నమైందంటూ చెప్పుకొచ్చారు. అత్యాచారం అనేది ప్రభుత్వ విధానంలో భాగం కాదని అత్యాచారంపై విమర్శలు చేయడం ప్రభుత్వ విధానాలను విమర్శించడం అవుతుందని దానిపై చర్యలు కూడా ఉంటాయని ఫైసల్ ఎద్దేవా చేశారు. 2017లో కూడా ప్రభుత్వం ఉద్యోగంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగం అంటే మనస్సు, కళ్లు, నాలుక, కాళ్లు, చేతులు అన్నీ బానిసత్వానికి లొంగిపోతాయని వ్యాఖ్యలు చేశారు.