బీజేపీలో జేవీఎం విలీనం: 14 ఏళ్ల తర్వాత సొంత గూటికి జార్ఖండ్ మాజీ సీఎం బాబూలాల్ మరాండీ
రాంచీ: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండీ తన పార్టీ జార్ఖండ్ వికాస్ మోర్చాను భారతీయ జనతా పార్టీలో విలీనం చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, మరియు బీజేపీ చీఫ్ జేపీ నడ్డాల సమక్షంలో ఆయన తన పార్టీని విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. 14 ఏళ్ల తర్వాత బాబూలాల్ మరాండీ తిరిగి తన సొంత గూటికి చేరుకున్నారు. 14 ఏళ్ల క్రితం బీజేపీతో విబేధాలు తలెత్తడంతో ఆయన పార్టీని వీడి జార్ఖండ్ వికాస్ మోర్చా పేరుతో సొంత పార్టీని పెట్టుకున్నారు.
2014లో తాను బీజేపీ చీఫ్గా నియమించినప్పటి నుంచే బాబూలాల్ మరాండీని బీజేపీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. అయితే మరాండీ తన నిర్ణయాలపై చాలా కఠినంగా ఉంటారని కొందరు తనతో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు అమిత్ షా. అతన్ని కన్విన్స్ చేసేందుకు చాలా సమయం పట్టిందని చాలా ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయని అమిత్ షా అన్నారు. జార్ఖండ్ ప్రజలు మనోభీష్టానికి మేరకు బాబూలాల్ మరాండీ మళ్లీ బీజేపీలోకి వచ్చారని అమిత్ షా చెప్పారు.
ఇదిలా ఉంటే అమిత్ షా చెప్పింది వాస్తవమేనని తనను బీజేపీలోకి తిరిగి రప్పించేందుకు ప్రయత్నాలు 2014 నుంచే మొదలయ్యాయని చెప్పారు. అయితే జేవీఎం విలీనం హఠాత్తుగా జరుగుతున్నది కాదని చెప్పారు. 2014 లోక్సభ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ తమతో చర్చలు జరిపిందని చెప్పారు. అప్పటి నుంచే జేవీఎం బీజేపీలో విలీనం చేయాలంటూ కోరిందని వెల్లడించారు మరాండీ. 2000వ సంవత్సరంలో జార్ఖండ్ తొలి ముఖ్యమంత్రిగా బీజేపీ నుంచి బాబులాల్ మరాండీ అయ్యారు. ఆ తర్వాత బీజేపీని వీడి సొంత పార్టీని పెట్టుకున్నారు.
Recommended Video
రాంచీలో విలీనం కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీజేపీ శ్రేణులు బాబూలాల్ మరాండీకి ఘనస్వాగతం పలికాయని జార్ఖండ్ బీజేపీ చీఫ్ ప్రతుల్ షాదేవ్ చెప్పారు. ఇక జేవీఎం నుంచి దాదాపు 20వేల మంది కార్యకర్తలు ఈ విలీనం వేడుకకు హాజరయ్యారు. జార్ఖండ్ రాజకీయాల్లో జేవీఎం బీజేపీల విలీనం చారిత్రాత్మకం అని అన్నారు. బీజేపీలో జేవీఎం విలీనం అవుతుందని ఫిబ్రవరి 11వ తేదీన మరాండీ ప్రకటించారు.