యంగ్ బ్లడ్: కాంగ్రెస్లోకి జెఎన్యూ మాజీ స్టూడెంట్స్ లీడర్: ఈ మధ్యాహ్నమే
న్యూఢిల్లీ: ఈ మధ్యకాలంలో ఎదుర్కొన్న అన్ని ఎన్నికల్లోనూ వరుస పరాజయాలను చవి చూసింది కాంగ్రెస్ పార్టీ. ఈ ఏడాది అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయింది. కేరళలో వరుసగా రెండోసారి కూడా ప్రతిపక్ష పాత్రకే పరిమితమైంది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత రాహుల్ గాంధీ స్వయంగా లోక్సభకు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న రాష్ట్రం అది. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అధికారాన్ని కోల్పోయింది.
తెలంగాణా వర్సెస్ ఏపీ : శ్రీశైలం నుండి ఏపీ అక్రమ నీటి తరలింపు నిలువరించండి; కేఆర్ఎంబీకి లేఖాస్త్రం
అయిదు రాష్ట్రాల్లో
తమిళనాడులో విజయం దక్కినా అది మిత్రపక్షం డీఎంకే ఘనతే తప్ప కాంగ్రెస్ది కాదనేది బహిరంగ రహస్యమే. అస్సాంలో కొంత మెరుగుపడినా అధికారాన్ని అందుకోలేదు. పశ్చిమ బెంగాల్లో నామమాత్రంగానే మిగిలింది. ఈ పరిస్థితుల మధ్య వచ్చే ఏడాది మరో అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది. దీనికోసం ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఈ ఏడాది ఎదురైన ఎదురుదెబ్బలు పునరావృతం కాకుండా ఉండటానికి కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకుంది.
యంగ్ బ్లడ్..
పార్టీలో యువ రక్తాన్ని ఎక్కించడానికి ప్రాధాన్యతను ఇస్తున్నట్టే కనిపిస్తోంది. రాజకీయాల్లో చురుగ్గా ఉండే యువతను పార్టీ వైపు ఆకర్షితులను చేయడంలో సఫలమౌతోంది. జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్, గుజరాత్కు చెందిన దళిత నేత, శాసన సభ్యుడు జిగ్నేష్ మేవాణిలను పార్టీలో చేర్చుకోనుంది. ఈ మధ్యాహ్నం 3 గంటలకు కన్హయ్య కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.
కన్హయ్య కుమార్ చేరిక హెల్ప్ అవుతుందా?
ఈ మధ్యకాలంలో కాంగ్రెస్లో చోటు చేసుకునే అతి పెద్ద చేరికగా, పరిణామంగా దీన్ని భావించవచ్చు. దేశ రాజధానిలోని ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో కన్హయ్య కుమార్ కాంగ్రెస్లో చేరనున్నారు. పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువాను కప్పుకొంటారని చెబుతున్నారు. జిగ్నేష్ మేవాణి వచ్చే వారం కాంగ్రెస్ తీర్థాన్ని పుచ్చుకుంటారని తెలుస్తోంది. ఈ రెండు చేరికలు పార్టీని బలోపేతం చేస్తాయనే అభిప్రాయాలు ఉన్నాయి.
సీపీఐ నుంచి
కన్హయ్య కుమార్.. ప్రస్తుతం సీపీఐలో కొనసాగుతున్నారు. ఆయన క్రియాశీలకంగా ఉండట్లేదు. 2019 లోక్సభ ఎన్నికల్లో సీపీఐ తరఫున పోటీ చేశారు. బిహార్లోని బేగుసరాయ్ స్థానం నుంచి ఎన్నికల బరిలో దిగారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు గిరిరాజ్ సింగ్పై పోటీ చేశారాయన. ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. 2,69,976 ఓట్లు పోల్ అయ్యాయి. ఆ తరువాత కన్హయ్య కుమార్ పెద్దగా క్రియాశీలకంగా ఉండట్లేదు.
Recommended Video
బిహార్లో కీలకంగా
మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్లో చేరనున్నారు. ఆయన చేరిక కాంగ్రెస్ను ఏ స్థాయిలో బలోపేతం చేస్తుందనేది ఆసక్తి రేపుతోంది. బిహార్లో కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్థాయిలో బలంగా లేదు. కన్హయ్య కుమార్ చేరికతో అట్టడుగు వర్గాల ప్రజల ఓటుబ్యాంకును పార్టీ వైపు ఆకర్షితులవుతారనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. క్రమంగా ఆయనను పీసీసీ అధ్యక్షుడిగా కూడా నియమించే అవకాశాలు లేకపోలేదు.