ఈశాన్య ఢిల్లీ అల్లర్లు: మాజీ జేఎన్యూ నేత ఉమర్ ఖలీద్ అరెస్ట్,..
ఈశాన్య ఢిల్లీ అల్లర్లకు సంబంధిచి జేఎన్యూ మాజీ విద్యార్థి నేత ఉమర్ ఖలీద్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఉపా (UAPA) కింద కేసు నమోదు చేశారు. అల్లర్లకు సంబంధించి ఖలీద్ను స్పెషల్ సెల్ పోలీసులు.. నిన్న దాదాపు 11 గంటలపాటు ప్రశ్నించారు. ఆ తర్వాత అరెస్ట్ చేశారు. ఇవాళ ఢిల్లీ కోర్టులో అతనిని ప్రవేశపెట్టనున్నారు.
అల్లర్లకు సంబంధించి ఈ నెల 2వ తేదీన కూడా ఖలీద్ను క్రైం బ్రాంచ్ పోలీసులు ప్రశ్నించారు. ఇంతకుముందు కూడా ఖలీద్పై వివిధ అభియోగాలు ఉన్నాయి. దీంతోపాటు ఆప్ నుంచి సస్పెండయిన తాహీర్ హుస్సేన్.. ఉమర్ ఖలీద్, ఖలీద్ సఫీని కలిశాడని చార్జీషీట్లో పోలీసులు పేర్కొన్నారు. జనవరిలో షహీన్ బాగ్ వద్ద అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన నేపథ్యంలో పెద్ద ఘటన చేయాలని వీరు భావించారని పోలీసులు చెబుతున్నారు. ట్రంప్ పర్యటించే సమయంలోనే అల్లర్లు చెలరేగడం కాస్త ఆందోళన కలిగించాయి. కానీ భారీ బలగాలను మొహరించి.. అల్లర్లను తగ్గుముఖం పట్టేలా చర్యలు తీసుకున్నారు. చిన్నగా మొదలైన గొడవ.. చినికి చినికి గాలివానలా మారింది.
ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లకు సంబంధించి ఏ ఒక్కరీ పాత్రపై లోతుగా పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ద్వేషం పెంచి, గొడవకు కారణమైన వారిని గుర్తిస్తున్నామని పేర్కొన్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 24వ తేదీన ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. ఘర్షణలో 50 మందికి పైగా చనిపోగా.. 108 మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారు. ఇద్దరు పోలీసులు చనిపోయిన సంగతి తెలిసిందే.