దిశా రవికి వ్యతిరేకంగా రాష్టపతికి లేఖ- మాజీ జడ్జీలు, పోలీసు బాస్లు, సీబీఐ మాజీ ఛీఫ్
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాల్సిన మార్గాన్ని సూచిస్తూ అంతర్జాతీయ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా ధన్బర్గ్ రూపొందించిన టూల్కిట్ను షేర్ చేసిన కేసులో దిశా రవికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో దిశా రవి వయ్సు కంటే ఆమె చేసిన నేరాన్ని పరిగణనలోకి తీసుకోవాలంటూ రాష్ట్రపతికి మాజీ న్యాయమూర్తులు, పోలీసు బాస్లు లేఖ రాయడం కలకలం రేపుతంది.
దిశా రవిని అమాయకురాలిగా చూపేందుకు ఆమె వయస్సును తెరపైకి తీసుకొస్తున్నారని, ఆమె చేసిన జాతి వ్యతిరేక చర్యల్ని సమర్ధించరాదని కోరుతూ రాష్ట్రపతి కోవింద్కు పలువురు మాజీ జడ్డీలు, మాజీ పోలీసు బాస్లు ఓ గ్రూప్గా ఏర్పడి లేఖ రాశారు. ఇందులో ముగ్గురు హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్లు, 17 మంది మాజీ జడ్డీలు, 18 మాజీ డీజీపీలు, ఓ మాజీ ఢిల్లీ పోలీసు కమిషనర్, మాజీ విజిలెన్స్ కమిషన్ సభ్యుడు, సీఆర్పీఎఫ్ డీజీలు, మాజీ హోంశాఖ కార్యదర్శులు ఉన్నారు. రాష్ట్రపతికి లేఖ రాసిన రాజస్ధాన్, ఢిల్లీ, పట్నా, సిక్కిం హైకోర్టుల ఛీఫ్ జస్టిస్లు వీఎస్ కోక్జే, రాజేంద్ర మీనన్, ప్రమోద్ కొహ్లీ ఉన్నారు. మాజీ సీబీఐ ఛీఫ్, తెలంగాణకు చెందిన నాగేశ్వరరావు కూడా ఈ లేఖ రాసిన వారిలో ఉన్నారు.
దిశా రవి కేసులో భావప్రకటనా స్వేచ్ఛకు భంగం కలుగుతోందంటూ ఈ మేధావులు మాట్లాడుతున్నారు. కానీ వీరంతా ఢిల్లీ పోలీసులను తమ పని తాము చేయనీయడం లేదంటూ లేఖలో వీరంతా ఆరోపించారు. ఢిల్లీ పోలీసులు ఎలాంటి ఒత్తిళ్లకు లోనవకుండా ఈ కేసులో స్వేచ్ఛగా దర్యాప్తు పూర్తి చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని ఈ లేఖలో వారు రాష్టపతిని కోరారు. స్వార్ధప్రయోజనాల కోసం విదేశీ శక్తుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారిన కొందరు జాతి వ్యతిరేక శక్తులుగా మారి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు లేఖలో వారు ఆరోపించారు.