నలుగురు జడ్జీల తిరుగుబాటు: మాజీ జడ్జీల బహిరంగ లేఖ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాకు నలుగురు మాజీ న్యాయమూర్తులు బహిరంగ లేఖ రాశారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు ప్రస్తావించిన అంశాలతో ఏకీభవిస్తున్నట్లు తెలిపారు.
ప్రధాన న్యాయమూర్తికి బహిరంగ లేఖ రాసినవారిలో ఒకరు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కాగా, మరో ముగ్గురు హైకోర్టు మాజీ న్యాయమూర్తులు. కేసుల కేటాయింపుల హేతుబద్దంగా, నిజాయితీగా, పారదర్శకంగా వ్యవహరించాలని వారుర ప్రధాన న్యాయమూర్తిని కోరారు.
ముఖ్యమైన, సున్నితమైన కేసుల విషయంలో అధికార దుర్వినియోగం జరగడం లేదని ప్రజలకు నమ్మకం కలిగించాలని వారన్నారు. కేసుల కేటాయింపులు జూనియర్ న్యాయమూర్తులు గల కొన్ని బెంచీలకు మాత్రమే జరగకూడదని, కేసుల కేటాయింపులో అటువంటి వివక్ష ఉండకూడదని వారన్నారు.
రిటైర్డ్ న్యాయమూర్తులు పిబి సావంత్, ఎపి షా, కె చంద్రు, హెచ్ సురేష్ ఆ బహిరంగ లేఖ రాశారు. తమ బహిరంగ లేఖను వారు మీడియాకు అందించారు. మాజీ న్యాయమూర్తులతో కలిసి భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసినట్లు జస్టిస్ షా ధ్రువీకరించారు.
లేఖలో తాను చెప్పిన అంశాలు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అభిప్రాయాలకు అనుగుణంగానే ఉన్నాయని ఆయన అన్నారు సమస్య పరిష్కారం కావాలని, బెంచీల కేటాయింపు, కేసుల పంపిణీకి నిర్దిష్టమైన నిబంధనలను రూపొందించాలని నలుగురు మాజీ న్యాయమూర్తులు తమ లేఖలో అన్నారు.