తీహార్ జైలుకు మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి: ఆ కారణం వల్లే!
న్యూఢిల్లీ: జనతాదళ్ (సెక్యులర్) అధినేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్ డీ కుమారస్వామి సోమవారం ఉదయం న్యూఢిల్లీకి చేరుకున్నారు. తీహార్ జైలులో విచారణను ఎదుర్కొంటున్న కర్ణాటక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి డీకే శివకుమార్ ను కలుసుకోనున్నారు. బెంగళూరు నుంచి ఈ తెల్లవారు జామున దేశ రాజధానికి చేరుకున్నారు. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నేరుగా తీహార్ జైలుకు బయలుదేరారు. మరి కాస్సేపట్లో ఆయన డీకే శివకుమార్ ను కలుస్తారు. ఈ సందర్భంగా తీహార్ జైలు వద్ద మీడియాతో క్లుప్తంగా మాట్లాడారు.
డీకే కథ ముగిసినట్టేనా? ఇక కుమారస్వామి వంతు: సమన్లు జారీ చేసిన న్యాయస్థానం
మనీ లాండరింగ్ కేసులో.. తీహార్ జైలులో..
కర్ణాటక కాంగ్రెస్ లో ట్రబుల్ షూటర్ గా గుర్తింపు ఉన్న డీకే శివకుమార్ సుమారు రెండు నెలలుగా సీబీఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల అదుపులో ఉన్నారు. సుమారు 600 కోట్ల రూపాయలకు పైగా మనీ లాండరింగ్ కేసులో ఆయన విచారణను ఎదుర్కొంటున్నారు. అరెస్టయిన తొలి రోజుల్లో సీబీఐ, ఈడీ ప్రధాన కార్యాలయాల్లో ఆయా అధికారుల విచారణ కొనసాగింది. అనంతరం తీహార్ జైలుకు డీకే శివకుమార్ ను తరలించారు. ఐఎన్ఎక్స్ మీడియా, ఎయిర్ సెల్-మ్యాక్సిస్ కేసులో విచారణను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ కే చెందిన సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి పీ చిదంబరం కూడా తీహార్ జైలులోనే ఉంటోన్న విషయం తెలిసిందే.
ప్రభుత్వ కుప్పకూలిన వెంటనే కేసు నమోదు..
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్ డీ కుమారస్వామి మంత్రివర్గంలో డీకే శివకుమార్ భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పని చేశారు. కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) కూటమికి చెందిన తిరుగుబాటు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం వల్ల ఈ ఏడాదిలో మేలో చోటు చేసుకున్న సంక్షోభం నేపథ్యంలో అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ కూటమి ప్రభుత్వం కుప్పకూలిన కొద్దిరోజుల వ్యవధిలోనే డీకే శివకుమార్ పై మనీ లాండరింగ్ కేసులు నమోదు కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరిచుకున్నాయి.
భగ్గుమన్న కుమార..
కాంగ్రెస్ లో ఎలాంటి సంక్షోభాన్నయినా తనదైన శైలిలో పరిష్కరించగల దిట్టగా డీకే శివకుమార్ కు పేరుంది. అలాంటి రాజకీయ నాయకుడి చేతులు కట్టేయడం వల్ల తమ ప్రభుత్వాన్ని అయిదేళ్ల పాటు కొనసాగించాలని బీజేపీ భావిస్తోందని, ఈ కారణంతోనే ఆయనపై అక్రమంగా కేసులను బనాయించారని కుమారస్వామి ఆరోపించారు. తీహార్ జైలు వద్ద తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. రాజకీయ కక్షసాధింపుల్లో భాగంగా కేంద్రంలోని భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసిందని విమర్శించారు.
అక్రమ కేసులతో ఇబ్బందులు
డీకే శివకుమార్ పై నమోదు చేసిన కేసులు ఏవీ నిరూపితం కాబోవని, త్వరలోనే ఆయన బెయిల్ పై విడుదలవుతారనే ఆశాభావాన్ని కుమారస్వామి వ్యక్తం చేశారు. తన ప్రత్యర్థులపై సీబీఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వంటి రాజ్యాంగబద్ధమైన సంస్థలను ప్రయోగించడం బీజేపీకి అలవాటైపోయిందని విమర్శించారు. కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ప్రభుత్వం కుప్పకూలిపోవడానికి కేంద్ర ప్రభుత్వమే ప్రధాన కారణమని, వందల కోట్ల రూపాయలను వెదజల్లి తమ కూటమికి చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని ఆయన ఆరోపించారు.