కర్నాటక మాజీ సీఎం అల్లుడు వీజీ సిద్ధార్థ అదృశ్యం
Recommended Video
బెంగళూరు : కర్నాటక మాజీ ముఖ్యమంత్రి బీజేపీ నేత ఎస్.ఎం కృష్ణ అల్లుడు వి.జి. సిద్ధార్థ అదృశ్యమయ్యాయి. కేఫ్ కాఫీడే వ్యవస్థాపకుడైన ఆయన.. సోమవారం సాయంత్రం కనుంచి కనిపించకుండా పోయారు. చివరిసారిగా ఆయన మంగళూరులోని నేత్రావతి నది వద్ద కనిపించారు. ఆ తర్వాత సిద్ధార్థ ఎక్కడికి వెళ్లారన్న విషయం ఎవరికీ తెలియలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సిద్ధార్థ కోసం గాలిస్తున్నారు.
కారు దిగి వెళ్లిన సిద్ధార్థ
సోమవారం సాయంత్రం సిద్ధార్థ సకలేష్పూర్ నుంచి బెంగళూరుకు బయలుదేరాడు. మంగుళూరు మీదుగా వెళ్లాలని చెప్పడంతో డ్రైవర్ అదే పనిచేశాడు. సాయంత్రం 6.30 గంటల సమయంలో వారు ప్రయాణిస్తున్న కారు నేత్రావతి బ్రిడ్జి పైకి చేరుకుంది. అక్కడికి రాగానే కారును పక్కకు ఆపమని చెప్పాడు. కారు నుంచి దిగిన సిద్ధార్థ బ్రిడ్జిపై నడుస్తూ ఫోన్లో మాట్లాడాడు. కొంంతత సేపటికి ఆయన కనిపించకుండా పోవడంతో ఆందోళనకు గురైన డ్రైవర్ సిద్ధార్థ కుటుంబ సభ్యులకు విషయం చెప్పాడు.
గజ ఈతగాళ్లతో గాలింపు
సిద్ధార్థ అదృశ్యమైన విషయం తెలిసి కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. దక్షిణ కన్నడ పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు నదీతీర ప్రాంతంలో గాలింపు చేపట్టారు. గజ ఈతగాళ్ల సాయంతో నదిలో వెతుకుతున్నారు. దాదాపు కిలోమీటర్ మేర ఉన్న వంతెన కింద భాగాన్ని జల్లెడపడుతున్నారు. అయితే అదృశ్యమై 12 గంటలు దాటినా ఇప్పటి వరకు సిద్ధార్థ ఆచూకీ దొరకలేదు. కాల్ డేటా ఆధారంగా ఆయన చివరగా ఎవరితో మాట్లాడారన్న విషయం తెలుసుకుని వారిని విచారిస్తున్నారు. సిద్ధార్థ తండ్రి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ప్రస్తుతం ఆయన మైసూర్లోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు.
సీఎం యడియూరప్ప పరామర్శ
కేఫ్ కాఫీడే వ్యవస్థాపకుడైన సిద్ధార్థ మిస్సింగ్ వ్యవహారం కర్నాటకలో కలకలం రేపింది. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి యడియూరప్ప మంగళవారం ఉదయం మాజీ సీఎం ఎస్.ఎం. కృష్ణ నివాసానికి వెళ్లారు. అక్కడి నుంచి గాలింపు చర్యల్ని పర్యవేక్షించారు. కాంగ్రెస్ నేత డి.కె. శివకుమార్ సైతం ఎస్.ఎం కృష్ణను పరామర్శించారు.