గాలి జనార్దన్ రెడ్డి బళ్లారీలోకి ఎంట్రీ
బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ఐదు ఏళ్ల తరువాత బళ్లారీలో అడుగు పెడుతున్నారు. ఆయన మైనింగ్ కింగ్ గా పేరు తెచ్చకుంది ఇదే బళ్లారీ జిల్లాలోనే. అయితే ఆయన జైలుకు వెళ్లిన తరువాత ఇదే మొదటి సారి బళ్లారీలో అడుగు పెడుతున్నారు.
తన ప్రాణమిత్రుడు, కర్ణాటక మాజీ మంత్రి బి. శ్రీరాములు ఇంటిలో నవంబర్ 2న జరుగుతున్న శుభకార్యానికి గాలి జనార్దన్ రెడ్డి వెలుతున్నారు. నవంబర్ 1వ తేదీ సాయంత్రం గాలి జనార్దన్ రెడ్డి బళ్లారీలో అడుగు పెడుతున్నారు. గాలి బళ్లారీకి వస్తున్నారంటే ఆయన అభిమానులు పెద్ద ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు.
అక్రమ మైనింగ్ కేసులో అరెస్టు అయిన గాలి జనార్దన్ రెడ్డి సీబీఐ కోర్టు ఆదేశాలమేరకు ఇప్పటి వరకు బళ్లారీలో అడుగు పెట్టలేదు. ఇప్పుడు శ్రీరాములు ఇంటిలో జరుగుతున్న శుభకార్యంతో పాటు తన కుమార్తె వివాహానికి తన అభిమానులను ఆహ్వానించడానికి గాలి బళ్లారీలో అడుగు పెడుతున్నారు.
జైలు నుంచి బయటకు వచ్చి ఇప్పటికే 20 నెలలు అయినా గాలి ఇప్పటి వరకు బళ్లారీలో అడుగు పెట్టలేదు. అందుకు అవకాశం రాలేదు. ఇప్పుడు తన కుమార్తె వివాహంతో పాటు తన మిత్రుడు శ్రీరాములు కొత్త ఇంటిలోకి వెలుతున్న సమయంలో బళ్లారిలో అడుగు పెట్టడానికి అన్నీ అనుకూలించాయి.
గాలి జనార్దన్ రెడ్డి బళ్లారిలో అడుగు పెట్టిన వెంటనే తన కులదైవంకు ప్రత్యేక పూజలు చేసి తరువాత తన కార్యక్రమాలు మొదలు పెడుతారని ఆయన వర్గీయులు తెలిపారు. మొత్తం మీద గాలి బళ్లారీలో అడుగు పెట్టిన తరువాత రాజకీయాలు ఎలా ఉంటాయో ? అని రాజకీయనాయకులు ఆరా తీస్తున్నారు.