కొత్త సీబీఐ డైరెక్టరుగా మధ్యప్రదేశ్ మాజీ డీజీపీ రిషికుమార్ శుక్లా నియామకం
ఢిల్లీ: గత కొద్దిరోజులుగా కొత్త సీబీఐ డైరెక్టర్ నియామకం పై మల్లగుల్లాలు పడుతున్న కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు కొత్త బాస్ను నియమించింది. మధ్యప్రదేశ్ మాజీ డీజేపీ రిషికుమార్ను నూతన సీబీఐ డైరెక్టరుగా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. రిషికుమార్ శుక్లా 1983 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి. అయితే ఈ పోస్టుకు రేసులో 1984 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారులు జావీద్ అహ్మద్, రజినీకాంత్ మిశ్రా, ఎస్ఎస్ దేస్వాల్లు ఉన్నారు.
మధ్యంతర డైరెక్టరు నాగేశ్వరరావు నియామకాన్ని సవాలు చేస్తే దాఖలైన పిటిషన్ను విచారణ చేస్తున్న సుప్రీంకోర్టు వెంటనే కొత్త డైరెక్టరును నియమించాలని ఆదేశించడంతో ప్రధాన మంత్రి నేతృత్వంలోని ప్యానెల్ రిషికుమార్ శుక్లాను ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుంది. సీబీఐ డైరెక్టరు పోస్టు చాలా ముఖ్యమైనదని అభిప్రాయపడ్డ సుప్రీంకోర్టు నియామకంలో జాప్యం తగదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో శనివారం ప్రక్రియను పూర్తి చేసింది కేంద్రం.
ఇదిలా ఉంటే సీబీఐ డైరెక్టరు పోస్టు జనవరి 10 వతేదీ నుంచి ఖాళీగా ఉంది. అనేక పరిణామాలు చోటుచేసుకోవడంతో సీబీఐ డైరెక్టరుగా అలోక్వర్మను కేంద్రం తొలగించింది. గుజరాత్ క్యాడర్ ఐపీఎస్ అధికారి రాకేష్ అస్తానాతో విబేధాలు రావడం, అలోక్ వర్మపై రాకేష్ అస్తానా అవినీతి ఆరోపణలు చేయడంతో ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. దీంతో పలు కీలక కేసులను విచారణ చేసే సీబీఐ వ్యవస్థ పరువు బజారున పడింది. ఇక అప్పటి నుంచి వ్యవహారం కోర్టుల చుట్టూ తిరుగుతూ వచ్చింది.