'కాంగ్రెస్లో చేరాలని ఒత్తిడి, వైఎస్ ఆ ప్రస్తావన తేలేదు, అరెస్ట్ చేస్తారని ఊహించా'
హైదరాబాద్:మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి, తనకు మధ్య ఓ వ్యాపారవేత్తకు, ముఖ్యమంత్రికి ఉన్న సంబంధం మాత్రమేనని మాజీ మంత్రి గాలి జనార్థన్ రెడ్డి ప్రకటించారు.కర్ణాటక రాష్ట్రంలోని బల్లారిలో బిజెపి హవా పెరగడానికి తాను కారణమనే అప్పటి యూపిఏ ప్రభుత్వం తనపై కఠినంగా వ్యవహరించిందని గాలి జనార్ధన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
కర్ణాటక రాష్ట్రంలో మంత్రిగా పనిచేయడమే కాకుండా బిజెపిలో కీలకంగా వ్యవహరించారు గాలి జనార్థన్ రెడ్డి. మైనింగ్ విషయంలో సిబిఐ కేసులో గాలి జనార్ధన్ రెడ్డి అరెస్టయ్యారు. అయితే ఈ విషయాలపై గాలి జనార్ధన్ రెడ్డి ఎబిఎన్ తెలుగు న్యూస్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఓపెన్ హర్ట్ విత్ ఆర్ కె ప్రోగ్రాంలో పలు విషయాలపై గాలి జనార్థన్ రెడ్డి తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు.
కర్ణాటక రాష్ట్ర రాజకీయాలతో పాటు, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిణామాలు, మైనింగ్ వ్యవహరాలు, తన కుటుంబ పరిస్థితులను ఆయన ఈ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.
బల్లారిలో కాంగ్రెస్ ను దెబ్బకొట్టానని యూపిఏ ప్రభుత్వం కక్షగట్టింది.
కర్ణాటక రాష్ట్రంలోని బల్లారి జిల్లాలో బిజెపిని బలోపేతం చేయడంలో తాను కీలకంగా వ్యవహరించానని అప్పటి యూపిఏ ప్రభుత్వం తనపై కఠినంగా వ్యవహరించిందని గాలి జనార్థన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి రావడం వెనుక తాను కీలకపాత్ర పోషించడం కూడ కాంగ్రెస్ పార్టికి నచ్చలేదన్నారు.ఈ కారణంగానే తనను కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసిందని ఆయన ఆరోపించారు.కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న బల్లారిని బిజెపికి వైపుకు తిప్పడంలో కీలకంగా వ్యవహరించినందునే తనపై కక్ష కట్టారనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.
వైఎస్ ఆ ప్రస్తావన తేనేలేదు
తనను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావాలని అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చిందని గాలి జనార్థన్ రెడ్డి చెప్పారు. కానీ,ఆ విషయాన్ని తన వద్ద వైఎస్ ఏనాడూ కూడ ప్రస్తావించలేదన్నారు. తనను ఓ వ్యాపారవేత్తగా మాత్రమే చూసారని ఆయన గుర్తు చేశారు.వైఎస్ ఒత్తిడి చేసినా కానీ, తాను బిజెపిని వీడేవాడిని కాదని ఆయన స్పష్టం చేశారు.ప్రస్తుతం కూడ తాను కర్ణాటక రాజకీయాలకే పరిమితం కానున్నట్టు చెప్పారు. ఏపీ రాజకీయాల్లో తాను వేలు పెట్టబోనని ఆయన తేల్చి చెప్పేశారు.
అరెస్ట్ చేస్తారని ముందుగానే ఊహించా
తనపై 2009లో కేసు నమోదైంది. 2011లో అరెస్టు చేశారు. ఆ రెండేళ్ల కాలంలో నాపై కక్ష కట్టారని అర్థమైంది. అప్పటి నుంచే తనను అరెస్ట్ చేస్తారనే విషయమై తాను మానసికంగా సిద్ధమయ్యానని చెప్పారు. తనను అరెస్ట్ చేస్తారనే విషయమై ఇంట్లో వాళ్లను కూడా అలానే సిద్ధం చేశానని గాలి జనార్ధన్ రెడ్డి చెప్పారు. నన్ను అరెస్టు చేసినా పిల్లలు పెద్దగా షాకవ్వలేదు.
జెడి లక్ష్మీనారాయణకు వెయిట్ చేస్తున్నా అని చెప్పా
తనను అరెస్ట్ చేసేందుకు సిబిఐ జెడి లక్ష్మీనారాయణ వచ్చి వారెంటు చూపించి సహకరించాలని కోరారు. అయితే . జస్ట్ ఐయాం వెయిటింగ్ అని మాత్రమే అన్నాను. మానసికంగా ప్రిపేర్ అయి ఉన్నాను కాబట్టి నేను ఎక్కువ టైం తీసుకోలేదు. 15 నిమిషాల్లోనే వారితో వచ్చేశానని గాలి జనార్ధన్ రెడ్డి గుర్తు చేసుకొన్నారు.
రామాయణం, బారతం చదివాను
జైలులో ఉన్నన్ని రోజులు రామాయణం, మహాభారతం, బ్రహ్మంగాగారి కాలజ్ఞానం వంటివి చదివేవాడిని. నేను చిన్నప్పుడు పోలీసు క్వార్టర్లో ఉండేవాడిని. మళ్లీ అలానే ఉన్నట్లు అనిపించింది.
బంగారు పల్లెం లేదు
బంగారు కుర్చీల గురించి పళ్లెం గురించి వచ్చిన ప్రచారం అంతా గ్రాఫిక్స్లో సృష్టించినవే. సీబీఐ వాళ్లే మా ఇంటికి వచ్చారు. వాళ్లు చాలా వస్తువులు సీజ్ చేశారు. అలా బంగారు కుర్చీలు ఉంటే వాళ్లు సీజ్ చేసి కోర్టుకు ఇచ్చి ఉండాలి. ఆ సీజ్ చేసిన వస్తువుల జాబితా చూస్తే మీకే తెలుస్తుంది అదంతా రాజకీయంగా ప్రత్యర్థులు చేసిన ప్రచారమేనని గాలి జనార్ధన్ రెడ్డి చెప్పారు.ఇవాళ్టికి కూడా మేం చాలా సాధారణ జీవితాన్ని గడుపుతామని చెప్పారు.
నిజాయితీగా సంపాదించిన డబ్బుతోనే బంగారు కిరీటం
తాను నీతి నిజాయితీగా సంపాదించిన దాంట్లోనే దేవుడికి కానుకలు ఇచ్చాను. ఎవరికైనా సాయం చేసినా నిజాయితీగా సంపాదించిన దాంతోనే చేశాను. నాపై ఉన్న ఆరోపణల్లో నిజానిజాలు కూడా ఏదోఒక రోజు తెలుస్తాయని గాలి జనార్ధన్ రెడ్డి ప్రకటించారు. తాను నిజాయితీగా సంపాదించిన డబ్బుతోనే వెంకటేశ్వరస్వామికి బంగారు కిరిటాన్ని చేయించినట్టు చెప్పారు.
హెలికాప్టర్ అందుకే కొన్నా
టైమ్ వృధా కాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతోనే తాను హెలికాప్టర్ను కొనుగోలు చేసినట్టు గాలి జనార్థన్ రెడ్డి చెప్పారు. సీబీఐ వాళ్లు పేర్కొన్న ప్రకారం నా టర్నోవరు 887 కోట్ల రూపాయలు అని ప్రకటించారు. 22 మిలియన్ టన్నుల ఐరన్ ఓర్ వ్యాపారం చేస్తే దాని మొత్తం విలువ రెండు వేల కోట్ల వరకూ ఉంటుంది. అదే ప్రచారంలోకి వచ్చేసరికి లక్ష కోట్లు అయిపోయింది. ఇందులోనే వెయ్యి కోట్లు బ్రహ్మణీ సిమెంట్స్లో పెట్టాం. మిగిలిన వెయ్యి కోట్లు ఇతర డైరెక్టర్లు, షేర్ హోల్డర్స్, డివిడెంట్లు అన్నీ పోను కొన్ని వందల కోట్లే ఉంటాయని ఆయన చెప్పారు.
కూతురి పెళ్ళి కోసం రూ. 30 కోట్లు ఖర్చు చేశా
నా కూతురు పెళ్లి ఘనంగా చేయాలన్న కోరికతోనే చేశాను. ఆ పెళ్లి తర్వాత ఇన్కంటాక్స్ వాళ్లు 24 గంటల్లోనే వచ్చి సోదాలు చేశారు. వారికి అన్ని బిల్లులు ఇచ్చాం. నిజంగా పెళ్లికి అయిన ఖర్చు 30 కోట్ల రూపాయలు మాత్రమే. వేసుకున్న నగలు, పెళ్లి జరిగిన తీరు మొత్తం మీరు కూర్చుని లెక్కేసినా అంతకు మించి లెక్క రాదు. కానీ 30 కోట్ల పెళ్లిని 500 కోట్లు చేసేశారని గాలి జనార్ధన్ రెడ్డి చెప్పారు.
దర్శకుడిగా మారాలని వ్యాపారంలోకి
తనకు మొదట్లో దర్శకుడు కావాలని కోరిక ఉండేదన్నారు.. అయితే, 21 ఏళ్లకే వ్యాపారంలోకి రావడంతో మళ్లీ సినిమాల్లోకి వెళ్దామంటే కుదరలేదు. దాంతోనే పెళ్లిలో వెడ్డింగ్ కార్డును అలా రూపొందించాం. నాకు ఎప్పటికైనా సినిమాలు తీయాలని, దర్శకత్వం చేయాలని ఉందన్నారు. తన కొడుకు కిరిటీని సినీ హీరోను చేస్తానని ఆయన చెప్పారు.