కర్ణాటకలో తండ్రికి పిండప్రదానం చేసిన ఐశ్వర్యరాయ్ బచ్చన్
మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ బచ్చన్ తన తండ్రి కృష్ణప్రసాద్ రాయ్ మరణించడంతో శనివారం సొంత ఊరు అయిన మంగళూరు సమీపంలోని ఉప్పినంగడి చేరుకుని ఉత్తరక్రియలు నిర్వహించారు.
బెంగళూరు: మాజీ ప్రపంచ సుందరి, బహుబాష నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ తన తండ్రి ఉత్తరక్రియలు నిర్వహించడానికి శనివారం కర్ణాటకలోని మంగళూరు చేరుకున్నారు. ముంబై నుంచి జెట్ ఎయిర్ వేస్ విమానంలో ఆమె మంగళూరులోని బజ్పే విమానాశ్రయం చేరుకున్నారు.
ఐశ్వర్యరాయ్ వెంట ఆమె కుమార్తె ఆరాధ్యా, కుటుంబ సభ్యులు మంగళూరు చేరుకుని తరువాత అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సొంత ఊరు అయిన ఉప్పినంగడి బయటుదేరి వెళ్లారు. ఐశ్వర్యరాయ్ తల్లిదండ్రులు కర్ణాటకలోని కరావళి ప్రాంతంలోని ఉప్పినంగడికి చెందిన వారు.
తండ్రి మరణించడంతో షాక్
ఐశ్వర్యరాయ్ తండ్రి కృష్ణప్రసాద్ రాయ్ (78) అనారోగ్యంతో ముంబైలోని బాంద్రాలోని లీలావతి ఆసుపత్రిలో మార్చి 18వ తేదిన మరణించారు.
తండ్రి ఆత్మ శాంతించాలని
ఐశ్వర్యరాయ్ తండ్రి కృష్ణప్రసాద్ రాయ్ మరణించడంతో ఇప్పటికే హిందూ సాంప్రదాయం ప్రకారం కొన్ని కార్యక్రమాలు ముంబై నగరంలోనే పూర్తి చేశారు.
పిండప్రదానం చెయ్యడానికి
సొంత ఊరు అయిన ఉప్పినంగడిలోని సహస్రలింగేశ్వర దేవస్థానం సమీపంలోని నేత్రావతి కుమారధార సంగమంలో ఐశ్వర్యరాయ్ తన తండ్రి కృష్ణప్రసాద్ రాయ్ కి పిండప్రదానం చెయ్యడానికి వచ్చారు.
గట్టి బందోబస్తు
ఐశ్వర్యరాయ్ ఉప్పినంగడికి చేరుకున్న సమయంలో స్థానిక పోలీసులు గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు. ఆమెతో ఫోటోలు తీసుకోవడానికి ప్రయత్నించిన అభిమానులను పోలీసులు వారించారు.
మౌనంగా ఉండిపోయిన ఐశ్వర్యరాయ్
తండ్రి మరణంతో విచారంతో ఉన్న ఐశ్వర్యరాయ్ తన కుటుంబ సభ్యులతో మాత్రం మాట్లాడారు. మరెవ్వరితో ఆమె మాట్లాడలేదు. కనీసం మీడియా సైతం ఆమెతో మాట్లాడించడానికి ప్రయత్నాలు చెయ్యలేదు. ఆమె తండ్రికి పిండప్రదానం చెయ్యడానికి వచ్చారని తెలుసుకున్న మీడియా కేవలం ఫోటోలు మాత్రం తీసుకుని అక్కడి నుంచి వెనుతిరిగి వెళ్లిపోయారు.