కాంగ్రెస్ లీడర్లకు షాక్: నటి రమ్యా ప్రత్యక్షం
బెంగళూరు: మాజీ ఎంపీ, బహుబాష నటి రమ్యా ఒక్క సారిగా ప్రజల ముందు ప్రత్యక్షం అయ్యారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను పట్టించుకోకుండా, ఆత్మహత్య చేసుకున్న రైతుల ఇండ్లకు వెళ్లి ఆమె వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి వచ్చారు.
మంగళవారం రమ్యా మండ్య జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అనేక గ్రామాలలో సంచరించారు. మండ్య లోని పడకనహళ్ళి, గాణద హోసూరు, హోన్ననాయకనహళ్ళి గ్రామాలకు వెళ్లి ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు.
పడకనహళ్ళికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్న మహేష్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. తరువాత మహేష్ కుటుంబ సభ్యులకు రూ. 50 వేలు ఆర్థిక సహాయం అందించారు. రమ్య మహేష్ ఇంటికి వచ్చిన తరువాత స్థానికులు మీడియాకు సమాచారం అందించారు.
మీడియా అక్కడికి వెళ్లే సమయానికి రమ్యా వెళ్లిపోయారు. రమ్యా పార్టీ గురించి, కార్యకర్తల గురించి పట్టించుకోవడం లేదని, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం లేదని మండ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.
తన మీద ఫిర్యాదు చేసిన వారి గురించి తానెందుకు పట్టించుకోవాలని అంటు వారికి కనీసం ఒక్క మాట చెప్పకుండా రమ్యా మండ్య జిల్లాలో పర్యటించారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ సందర్బంలో స్థానిక శాసన సభ్యులు, నాయకులు రమ్యా మీద మరింత మండిపడుతున్నారు.