రైతుల ఆందోళనలకు మాజీ క్రీడాకారుల సంఘీభావం- అవార్డులు వెనక్కించేందుకు సిద్ధం
కేంద్రం తీసుకొచ్చిన కార్పోరేట్ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో రైతులు సాగిస్తున్న ఆందోళననలకు సమాజంలో పలు వర్గాల నుంచి మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే రైతుల ఆందోళనలకు మద్దతుగా బీజేపీకి మిత్రపక్షాలు గళం విప్పుతుండగా.. ఇప్పుడు మాజీ క్రీడాకారులు కూడా రైతులకు మద్దతుగా అవార్డులు వెనక్కిచ్చేందుకు సిద్ధమయ్యారు.
రైతుల ఆందోళనలపై కేంద్రం దమనకాండను నిరసిస్తూ గతంలో కేంద్రం తమకు ఇచ్చిన ప్రతిష్టాత్మక క్రీడా పురస్కారాలను వెనక్కి ఇచ్చేయాలని మాజీ క్రీడాకారులు నిర్ణయించారు. వీరిలో అర్జున, పద్మశ్రీ అవార్డుల గ్రహీత, రెజ్లర్, బాస్కెట్ బాల్ క్రీడాకారుడు కర్తార్ సింగ్, బాస్కెట్ బాల్ క్రీడాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత సజ్జన్ సింగ్, హాకీ అర్జున అవార్డు గ్రహీత రాజ్దీప్ కౌర్ ఉన్నారు. వీరంతా ఈ నెల 5న రైతుల ఆందోళనల్లో పాల్గొని రాష్ట్రపతి భవన్ ఎదుట తమ పతకాలు వదిలిపెడతామని హెచ్చరించారు.
Recommended Video
మరోవైపు రైతుల ఆందోళనలకు మద్దతుగా పంజాబ్, హర్యానాతో పాటు ఢిల్లీలోని అన్ని గురుద్వారాల్లో సిక్కులు ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహిస్తున్నారు. కేంద్రం మొండి వైఖరి వీడాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. రైతుల ఆగ్రహాన్ని లెక్కచేయకుండా ముందుకెళితే కాంగ్రెస్కు ఎదురైన గతే పడుతుందని వారు హెచ్చరిస్తున్నారు. ఆందోళన చేస్తున్న రైతులను ఉగ్రవాదులుగా బీజేపీ నేతలు అభివర్ణించడాన్ని ఢిల్లీ సిక్కు గురుద్వారా కమిటీ ఖండించింది.