సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలని చెప్పలేదు: కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, మాజీ ప్రధాని !
బెంగళూరు: కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలని తాను కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరకు వెళ్లలేదని జేడీఎస్ పార్టీ చీఫ్, మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ అన్నారు. తన మీద కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ కు ఫిర్యాదు చేసిన విషయం తనకు తెలీదని, దాని విషయం నేను ఆలోచించనని దేవేగౌడ చెప్పారు. ఎందుకంటే కర్ణాటకలో తాను కాంగ్రెస్- జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలని ఎక్కడా చెప్పలేదని దేవేగౌడ గుర్తు చేశారు. కర్ణాటకలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయాల గురించి మాజీ ప్రధాని దేవేగౌడ గురువారం బెంగళూరులో మీడియా ముందు వివరణ ఇచ్చారు.
సోనియా, రాహుల్ గాంధీ
యూపీఏ చెర్మన్ సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఢిల్లీలో చర్చించి గులామ్ నబి ఆజాద్ ను బెంగళూరు పంపించారని దేవేగౌడ గుర్తు చేశారు. తరువాత మాజీ సీఎం సిద్దరామయ్య, మల్లికార్జున్ ఖార్గే, డాక్టర్ జీ. పరమేశ్వర్, కేహెచ్. మునియప్ప కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేద్దామని తన దగ్గరకు వచ్చారని మాజీ ప్రధాని దేవేగౌడ అన్నారు.
సీఎం ఎవరు ?
కాంగ్రెస్ పార్టీ నాయకులతో చర్చించిన తాను మల్లికార్జున్ ఖార్గేని సీఎం చేద్దామని తాను సూచించానని, అయితే కుమారస్వామిని ముఖ్యమంత్రిని చేద్దామని కాంగ్రెస్ నాయకులు తనకు మనవి చేశారని మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ అన్నారు. తన మీద ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ కు ఫిర్యాదు చెయ్యడం విడ్డూరంగా ఉందని, దాని గురించి తాను పట్టించుకోనని మాజీ ప్రధాని దేవేగౌడ వివరణ ఇచ్చారు.
ఎన్నికలకు సిద్దం !
మధ్యంతర ఎన్నికలకు సిద్దం కావాలనే విషయంలో తాను చెప్పిన మాటలను మీడియాలో తప్పుగా ప్రచారం చేశారని మాజీ ప్రధాని దేవేగౌడ విచారం వ్యక్తం చేశారు. తాలుకా, జిల్లా, నగర సభ ఎన్నికలకు సిద్దం కావాలని తాను జేడీఎస్ కార్యకర్తలకు పలుపునిచ్చానని, మీడియాలో శాసన సభ ఎన్నికలకు సిద్దం కావాలని ప్రచారం జరిగిందని మాజీ ప్రధాని దేవేగౌడ వివరణ ఇచ్చారు. సంకీర్ణ ప్రభుత్వం మీద తనకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని దేవేగౌడ స్పష్టం చేశారు.
సిద్దూ సలహాలు !
మాజీ సీఎం సిద్దరామయ్య సలహా మేరకే తాము స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఇచ్చామని, ఒక నామినేటెడ్ పదవి ఇచ్చామని మాజీ ప్రధాని దేవేగౌడ అన్నారు. జేడీఎస్ పార్టీ ముస్లీంలకు అధిక ప్రధాన్యత ఇచ్చిందని, గతంలో జరిగిన అన్ని ఎన్నికల్లో తమ పార్టీకి చెందిన ముస్లీంలే విజయం సాధించి వచ్చారని మాజీ ప్రధాని దేవేగౌడ గుర్తు చేశారు.
హై కమాండ్
సంకీర్ణ ప్రభుత్వంలోని కాంగ్రెస్ పెద్దలు తన మీద ఆ పార్టీ హై కమాండ్ కు ఫిర్యాదు చేశారు అనే విషయం తాను మీడియాలోనే చూశానని మాజీ ప్రధాని దేవేగౌడ అన్నారు. అయితే ఈ విషయంలో వ్యక్తి గతంగా తనకు ఎలాంటి సమాచారం లేదని, అన్ని విషయాలు తెలుసుకుని మాట్లాడుతానని దేవేగౌడ అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయిన నాయకులతో తాను శుక్రవారం సమావేశం అవుతానని, స్థానిక సంస్థల ఎన్నికల్లో జేడీఎస్ పార్టీ బలోపేతం చెయ్యాలని కార్యకర్తలకు మనవి చేస్తానని మాజీ ప్రధాని దేవేగౌడ అన్నారు.