కర్ణాటక ప్రభుత్వంపై బ్రిటీష్ హై కమీషనర్ కు డౌట్, సీఎం కొడుకు కోసం ఆంధ్రా అమ్మాయి!
బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం పూర్తి కాలం అధికారంలో ఉంటుందా ? ఉండదా ? అనే అనుమానం భారతదేశ ప్రజలకు ఉందని, ఈ విషయంపై విదేశాల్లో సైతం జోరుగా చర్చ జరుగుతోందని స్వయంగా మాజీ ప్రధాని, జేడీఎస్ చీఫ్ హెచ్.డి. దేవేగౌడ అన్నారు. సీఎం కుమారస్వామి కొడుకు, ప్రముఖ హీరో నిఖిల్ పెళ్లి కోసం శుక్రవారం విజయవాడలో అమ్మాయిని చూడటానికి వెళ్లారని దేవేగౌడ వివరించారు.
బ్రిటీష్ హైకమీషనర్ భేటీ
శుక్రవారం బెంగళూరులోని పద్మనాభనగర్ లో మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ నివాసానికి బ్రిటీష్ హై కమీషనర్ డోనాల్డ్ మైక్ అలిస్టర్ వెళ్లారు. కర్ణాటకలోని జేడీఎస్-కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం విషయంపై బ్రిటీష్ హై కమీషనర్ డోనాల్డ్ మైక్ అలిస్టర్ తనతో చర్చించారని మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ చెప్పారు.
దేవేగౌడ ధీమా
కర్ణాటకలోని జేడీఎస్-కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు అధికారంలో ఉంటుందని బ్రిటీష్ హైకమీషనర్ కు తాను భరోసా ఇచ్చానని మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ అన్నారు. బ్రిటీష్ హై కమీషనర్ తో భేటీ అనంతరం మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ మీడియాతో మాట్లాడారు.
సీఎం కుమార VS సిద్దూ
కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు లేవని మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటక సీఎం కుమారస్వామికి, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యల మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని, అవన్నీ పుకార్లు అని హెచ్.డి. దేవేగౌడ చెప్పారు.
సీఎం అభ్యర్థి
మంత్రి ఆర్ వీ. దేశ్ పాండే సీఎం అభ్యర్థి అనే విషయం కొత్తగా తెరమీదకు రాలేదని, ధర్మసింగ్ సీఎంగా ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఈ విషయంపై చర్చ జరిగిందని హెచ్.డి. దేవేగౌడ అన్నారు. సీఎం కుమారస్వామి మంత్రి ఆర్.వి.దేశ్ పాండ్ సీఎం అవ్వడానికి అర్హుడు అని మాత్రం చెప్పారని, దానిని వేరే విధంగా భావించకూడదని మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ అన్నారు.
సీఎం కొడుకు కోసం ఆంధ్రా అమ్మాయి !
శుక్రవారం కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి, ఆయన సతీమణి అనితా కుమారస్వామి ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఎందుకు వెళ్లారు అని మీడియా ప్రశ్నించింది. సీఎం కుమారస్వామి కుమారుడు, ప్రముఖ హీరో నిఖిల్ కుమారస్వామికి అమ్మాయిని చూడటానికి వెళ్లారని, అందరికీ ఇష్టం అయితే పెళ్లి జరిపిస్తామని, ఇది వ్యక్తిగత విషయం అని, తాను ఎక్కవగా మాట్లాడనని మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ అన్నారు.