లోక్ సభ ఉప ఎన్నికల వేడి: హాయిగా మాజీ ప్రధాని లండన్ టూర్, ఏమిటి ప్లాన్, సీఎం!
బెంగళూరు: కర్ణాటకలోని మూడు లోక్ సభ నియోజక వర్గాలు, రెండు శాసన సభ నియోజక వర్గాల ఉప ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. ఉప ఎన్నికల వేడితో అందరూ సతమతం అవుతున్న సమయంలో జేడీఎస్ చీఫ్, మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ హాయిగా ఐదు రోజుల విదేశీపర్యటనకు శ్రీకారం చుట్టడంతో అందరూ ఆశ్చర్యానికి గురి అయ్యారు. ఉప ఎన్నికల ప్రచార బాధ్యత సీఎం హెచ్.డి. కుమారస్వామికి అప్పగించారని సమాచారం.
కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్-జేడీఎస్ పార్టీలు తమ ఉమ్మడి అభ్యర్థులు విజయం సాధించడానికి శక్తి వంచనలేకుండా పనిచేస్తున్నారు. మండ్య, శివమొగ్గ లోక్ సభ నియోజక వర్గాల్లో జేడీఎస్ అభ్యర్థులు, బళ్లారిలో కాంగ్రెస్ అభ్యర్థి బరిలో ఉన్నారు.
మండ్య, శివమొగ్గ లోక్ సభ స్థానాల్లో కచ్చితంగా విజయం సాధించాలని గట్టి పట్టుతో ఉన్న మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ ఇప్పటికే అనేకసార్లు కాంగ్రెస్ పార్టీ నాయకులతో మంతనాలు జరిపి చర్చించారు. జేడీఎస్ అభ్యర్థుల గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సహకరించాలని సీఎం కుమారస్వామి మనవి చేశారు.
ఇలాంటి సమయంలో మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ ఈనెల 24వ తేదీ బెంగళూరు నుంచి లండన్ వెలుతున్నారు. 25వ తేదీ లండన్ లో జరుగుతున్న గ్లోబల్ అచీవర్స్ కాన్ల్నేవ్ కార్యక్రమంలో హెచ్.డి. దేవేగౌడ పాల్గొంటున్నారు.
అనంతరం లండన్ లోనే ప్రవాసాంధ్రులు, కన్నడిగులతో మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ ప్రత్యేక సమావేశం కానున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడు విదేశీ పర్యటన చేపట్టినా ఆ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రవాసాంధ్రులతో భేటీ అయ్యేవారు. ప్రవాసాంధ్రులు బీజేపీ వైపు ఆకర్షితులు అయ్యే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు అదే బాటలో మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ సిద్దం అయ్యారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.