మాజీ ప్రధాని బ్రహ్మాస్రం: సీఎం, ఉప ముఖ్యమంత్రిని మార్చేద్దాం, రెబల్స్ కు బుజ్జగింపులు, ఫలితం!
బెంగళూరు: కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలడానికి సిద్దంగా ఉన్న సమయంలో మాజీ ప్రధాని, జేడీఎస్ చీఫ్ హెచ్.డి. దేవేగౌడ బ్రహ్మాస్రం వదిలారు. కర్ణాటక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని మార్చడానికి మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ అంగీకరించారని జేడీఎస్ వర్గాలు అంటున్నాయి.
ముఖ్యమంత్రి కుమారస్వామిని, ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వరన్ ను వెంటనే వారి పదవుల నుంచి తప్పించాలని రెబల్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారని తెలిసింది. ఈ విషయంలో జేడీఎస్ నాయకులతో మంతనాలు జరిపిన మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ సిద్దరామయ్యను సీఎం చేసి మంత్రి హెచ్.డి. రేవణ్ణ ఉప ముఖ్యమంత్రి చెయ్యడానికి అంగీకరించారని సమాచారం.
సోమవారం ఉదయం కాంగ్రెస్ పార్టీకి చెందిన 21 మంత్రులు సామూహిక రాజీనామాలు చేశారు. సోమవారం మద్యాహ్నం జేడీఎస్ కు చెందిన మంత్రులు అందరూ రాజీనామా చేసి వారి లేఖలు తనకు అందించారని స్వయంగా సీఎం కుమారస్వామి చెప్పారు.
కూల్ కుమారస్వామి: ఎవరు ఏం చేసినా నేను ఏం పట్టించుకోను అంతే, కర్ణాటక సీఎం, బీజేపీ !
ఇదే సమయంలో సీన్ లోకి ఎంట్రీ ఇచ్చిన మాజీ ప్రధాని దేవేగౌడ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోకుండా ఉండాలంటే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులను మార్చాలని, అందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని కాంగ్రెస్ నాయకులు సమాచారం ఇచ్చారని జేడీఎస్ వర్గాలు చెబుతున్నాయి.
ఎలాంటి పరిస్థితుల్లో బీజేపీ మాత్రం అధికారంలోకి రాకుండా చూడాటానికి కాంగ్రెస్, జేడీఎస్ నాయకులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ ఈ ప్రతిపాదన తెరమీదకు తీసుకు వచ్చారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలలో చాల మంది మాజీ సీఎం సిద్దరామయ్య అనుచరులు ఉండటంతో మాజీ ప్రధాని దేవేగౌడ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని తెలిసింది.