మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. ఎయిమ్స్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్
భారత మాజీ ప్రధానమంత్రి, కాంగ్రెస్ కీలక నేత డాక్టర్ మన్మోహన్ సింగ్(87) ఆరోగ్యం కుదుటపడింది. సడెన్ గా ఛాతిలో నొప్పి రావడంతో ఆదివారం రాత్రి ఆయనను హుటాహుటిన ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించగా, కార్డియో విభాగంలో చికిత్సతో పూర్తిగా కోలుకున్నారని వైద్య బృందం తెలిపింది. ప్రస్తుతానికి సింగ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, డిశ్చార్జ్ కూడా చేశామని ఎయిమ్స్ అధికారులు మంగళవారం ఒక ప్రకటన చేశారు.
మన్మోహన్ డిశ్చార్జ్ కావడానికి రెండు గంటల ముందు కూడా ఎయిమ్స్ ఆస్పత్రి ఓ బులిటెన్ విడుదల చేసింది. మాజీ ప్రధానికి కరోనా టెస్టులు కూడా నిర్వహించినట్లు, ఫలితం నెగటివ్ గా వచ్చినట్లు అందులో పేర్కొన్నారు. కార్డీయాలజీ ప్రెఫెసర్ డాకర్ట నితీష్ నాయక్ పర్యవేక్షణలో చికిత్స జరగగా సింగ్ పూర్తిగా కోలుకున్నారు. 87 ఏళ్లు మన్మోహన్కు ఇప్పటికే రెండుసార్లు బైపాస్ సర్జరీ జరిగింది. 1990లో ఒకసారి, 2009 మరోసారి ఈ సర్జరీలు జరిగాయి. మన్మోహన్ సింగ్ డయాబెటిక్ పేషెంట్ కూడా. మొత్తానికి గండం గట్టెక్కడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
మన్మోహన్ సింగ్ ఆస్పత్రిలో చేరడంపై ఆందోళన వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ.. తమ నేత కోలుకోవాలంటూ ప్రార్థనలు చేయాల్సిందిగా ప్రజలను కోరడం తెలిసిందే. అందరి ప్రార్థనలు ఫలించి, సింగ్ ఆరోగ్యం కుదుటపడటంతో పార్టీలో ఆనందం వెల్లివిరిసింది. అధినేత్రి సోనియా గాంధీ, మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, ఇతర ముఖ్య నేతలు మన్మోహన్ ను పరామర్శించే అవకాశముందని ఏఐసీసీ వర్గాలు చెప్పాయి.
అంతకుముందు, మన్మోహన్ ఆరోగ్య పరిస్థితిపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలుగులో ట్వీట్ చేశారు. ''ఎయిమ్స్ డైరెక్టర్ తో మాట్లాడి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశాను. వారి ఆరోగ్యం కుదుటపడుతోందని తెలిసి సంతోషిస్తున్నాను. మన్మోహన్ సింగ్ త్వరగా కోలుకోవాలని భగవంతుడిని కోరుతున్నా''అని రాశారు.