డొనాల్డ్ ట్రంప్కు రాష్ట్రపతి విందు: మన్మోహన్ సింగ్ గైర్హాజరుకు నిర్ణయం, ఎందుకంటే?
న్యూఢిల్లీ: రెండ్రోజుల పర్యటన నిమిత్తం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. అగ్రరాజ్యం అధ్యక్షుడి రాక సందర్భంగా గౌరవార్థం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి భవిన్లో విందు ఇవ్వనున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా పలు రాష్ట్రాల సీఎంలు, ప్రముఖులకు విందులో పాల్గొనాల్సిందిగా రాష్ట్రపతి ఆహ్వానాలు పంపిన విషయం తెలిసిందే. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు కూడా ఈ జాబితాలో ఉంది. అయితే, డొనాల్డ్ ట్రంప్ రాక సందర్భంగా రాష్ట్రపతి ఇచ్చే విందుకు హాజరుకాకూడదని మన్మోహన్ సింగ్ నిర్ణయించుకున్నారు.
నాలుగు రోజుల ముందు విందు ఆహ్వానానికి అంగీకరించిన మన్మోహన్ సింగ్.. ఇప్పుడు హఠాత్తుగా తన నిర్ణయాన్ని మార్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే, ఆరోగ్య కారణాలతోనే తాను విందుకు హాజరుకాలేకపోతున్నానని రాష్ట్రపతి భవన్కు మన్మోహన్ సమాచారమిచ్చారు.
కానీ, మన్మోహన్ తాజా నిర్ణయానికి మరో కారణంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాష్ట్రపతి భవన్ నుంచి విందు ఆహ్వానం అందకపోవడంతోనే మన్మోహన్ తోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు తమ నిర్ణయాన్ని మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది.
కాగా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రతిపక్ష నేత మధ్య ఎటువంటి సమావేశం నిర్వహించకపోవడం గమనార్హం. విదేశీ నాయకులు భారత పర్యటనకు వచ్చినప్పుడు విపక్షాలకు చెందిన సీనియర్ నేతలను ఆహ్వానించే సాంప్రదాయాన్ని మోడీ సర్కారు పక్కన బెట్టిందని మండిపడుతున్నారు. సోనియాను ఆహ్వానించకపోవడంతో కాంగ్రెస్ రాజ్యసభాపక్ష నేత గులాంనబీ ఆజాద్, లోక్సభలో ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి కూడా రాష్ట్రపతి ఇచ్చే విందుకు హాజరుకాకూడదని నిర్ణయించుకున్నారు.