మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఫార్ములా: ఇవి పాటిస్తే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టొచ్చు
న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత దయనీయ స్థితిలో ఉన్న విషయం తెలిసిందే. ఇందుకు కారణం ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేయడం, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్ (జీఎస్టీ) సరిగ్గా అమలు చేయడంలో విఫలమవడం వల్లే ఆర్థిక పరిస్థితి గతితప్పిందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. అయితే ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి గట్టెక్కే అవకాశాలున్నాయని చెబుతూ ఇందుకోసం ఐదు అంశాలను సూచించారు.
ఐదు సంస్కరణలను సూచించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్
ఐదు సంస్కరణలు చేపట్టేముందు దేశం ఆర్థిక సంక్షోభంను ఎదుర్కొంటుందని ముందుగా ప్రభుత్వం అంగీకరించాలని మన్మోహన్ చెప్పారు. ప్రభుత్వం నిపుణులు చెబుతున్న అంశాలను పరిగణలోకి తీసుకోవాలని చెప్పిన మన్మోహన్ సింగ్... దీనిపై దృష్టిసారిద్దామన్న విషయాన్ని మోడీ ప్రభుత్వం మరిచిందన్నారు. మోడీ ప్రభుత్వం ప్రధాన వార్తల్లో నిలువాలన్న కోరిక నుంచి బయటపడాలని.. ఇప్పటికే చాలా సమయం వృథా చేశారని చెప్పారు.వివిధ రంగాల గురించి ఒక్కో సమయంలో వేర్వేరు ప్రకటనలు చేయడానికి బదులుగా మొత్తం అన్ని రంగాలను ఒకే గొడుగుకిందకు తీసుకొచ్చి వాటిని పరిష్కరించే దిశగా ప్రయత్నించాలని మన్మోహన్ చెప్పారు.
జీఎస్టీని లాజికల్గా అమలు చేయాలి
జీఎస్టీతో కొంత కాలం నష్టాలు వచ్చినప్పటికీ దీన్ని ఒక పద్ధతి ప్రకారం ప్రతిఒక్కరికీ అర్థం అయ్యేలా వివరించాలని మన్మోహన్ కోరారు. వ్యవసాయ రంగంలో కొత్త విధానాలను ప్రవేశపెట్టడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వినియోగంను పెంచాలని సూచించారు. వ్యవసాయ ఆధారిత మార్కెట్లకు ఉన్న అన్ని సంకెళ్లను తీసివేసి స్వేచ్ఛగా పనిచేసే విధానం తీసుకువచ్చి నేరుగా ప్రజల చేతికే డబ్బులు అందేలా చూడాలన్నారు. ఇది కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉంచామని చెప్పారు. మూలధనం ఏర్పాటుకు నగదును వ్యవస్థలోకి పంప్ చేయాలని మూడో సంస్కరణగా సూచించారు మాజీ ప్రధాని. ఇక నాల్గవదిగా ప్రాధాన్యత కలిగిన రంగాల్లో సంస్కరణలు తీసుకురావాలని చెప్పారు. అంటే టెక్స్టైల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ మరియు తక్కువ ధరకే గృహాలు వంటి అంశాలపై దృష్టిసారించాలని చెప్పారు. ఇందుకోసం రుణాలు ఇవ్వాలని అదికూడా సరళమైన పద్ధతిలో జరగాలని చెప్పారు.
అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధాన్ని అవకాశంగా మలుచుకోవాలి
అమెరికా చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధాన్ని అవకాశంగా మలుచుకుని కొత్త ఎగుమతులకు మార్గాలను అన్వేషించాలని సూచించారు. ఇలా చేస్తే ప్రతి సమస్యకు పరిష్కారం కనుగొనగలిగితే ఆర్థిక వృద్ధి తిరిగి మూడు నాలుగేళ్లలో పుంజుకుంటుందని చెప్పారు. భారత దేశ ఆర్థిక వ్యవస్థ చాలా అడుగంటిపోయిందని ఇది తప్పక ఒప్పుకోవాల్సిన నిజం అని పేర్కొన్నారు. సాధారణ జీడీపీ వృద్ధి కూడా గత 15 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా పడిపోయిందన్నారు. ఆర్థిక వ్యవస్థను ఆదుకునే కీలక రంగాలు కూడా నష్టాల బాట పట్టాయని మాజీప్రధాని మన్మోహన్ తెలిపారు. ఇక ఆటోమొబైల్ ఇండస్ట్రీ కూడా తీవ్ర నష్టాల్లో ఉందని చెప్పిన మన్మోహన్ ఇప్పటికే 3.5 లక్షల ఉద్యోగాలు పోయాయని చెప్పారు. రియల్ ఎస్టేట్ రంగం కూడా దారుణంగా పడిపోయిందని మాజీ ప్రధాని వ్యాఖ్యానించారు. ఇక నిరుద్యోగం అనేది గత 45 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా ఒక్క 2017-18లోనే ఉందని కామెంట్ చేశారు.