మూలాలను మరవని మహామనిషి కలాం
న్యూఢిల్లీ: అబ్దుల్ కలాం ఎంత ఎత్తుకు ఎదిగినా తన మూలాలను ఏనాటికి మరువని మహామనిషిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అనుకున్నది సాధించే వారకు ఆయన నిద్రపోరని ఆయనతో పాటు ఉద్యోగం చేసిన డీఆర్ డీవో ఉద్యోగులు చెప్పిన సందర్బాలు ఉన్నాయి.
డీఆర్ డీవో లో ఉద్యోగం చేసే సమయంలో భద్రతా చర్యలలో భాగంగా భవనం చుట్టూ ఉండే ప్రహరీ పై గాజు పెంకులు పెడదామని సహచరులు సూచిస్తే అందుకు కలాం అంగీకరించలేదు. పక్షులు వాటి మీద కుర్చుంటే గాయాలు అవుతాయని నిరాకరించారు.
2002లో చెన్నై లోని అన్నాయూనివర్శిటిలో విద్యార్థులకు పాఠాలు చెబుతున్న సమయంలో అప్పటి ప్రధాని వాజ్ పాయ్ నుంచి ఫోన్ వచ్చింది. క్లాస్ రూంలో ఉన్నందువల్ల కలాం ఫోన్ రిసీవ్ చేసుకోలేకపోయారు. తరువాత బయటకు వచ్చిన సమయంలో వాజ్ పాయ్ ఫోన్ చేశారు.
కలాం గారు మీరు రాష్ట్రపతి పదవి చేపడతారా అని అడిగారు. ఒక గంట సమయం ఇవ్వాలని కలాం అడిగారు. తరువాత స్నేహితులు, శ్రేయోభిలాషులతో చర్చించారు. 60 శాతం మంది ఓకే చెప్పారు. 40 శాతం మంది ఆ పదవి వద్దు అని కలాంతో అన్నారు.
అయితే మెజారిటి వైపు కలాం మొగ్గు చూపారు. రాష్ట్రపతి అయితే దేశం గురించి ఆలోచించవచ్చని, విద్య, యువత గురించి చర్చించడానికి చక్కటి అవకాశం ఉంటుందని సరే అన్నారు. రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో 100 మంది విద్యార్థులను ఆ కార్యక్రమానికి ఆహ్వానించారు.
రాష్ట్రపతి అయిన తరువాత కలాం మొదటి సారి కేరళ వెళ్లారు. తిరువనంతపురంలోని రాజ్ భవన్ లో విందుకు ఆహ్వానించిన వారిలో ఒక చిన్న హోటల్ యజమాని ఉన్నారు. తిరువనంతపురంలో కలాం పని చేసే సమయంలో ఆ చిన్న హోటల్ లోనే ఆయన బోజనం చేసేవారు.
హోటల్ యజమానిని గుర్తు పెట్టుకుని ఆయనను రాజ్ భవన్ కు ఆహ్వానించి పాత రోజులు గుర్తు చేసుకున్నారు. మీ హోటల్ బోజనం నాకు బాగ వంటపట్టిందని ఆయనతో సరదాగా గడిపారు. భారతదేశ ప్రథమ పౌరుడి స్థానంలో ఉంటు ఒక చిన్న హోటల్ యజమానిని పక్కన కుర్చోపెట్టుకుని మాట్లాడిన కీర్తి కలాం సోంతం.