మీడియా.. ఫ్యాక్టరీ ఆఫ్ ఫేక్న్యూస్: ప్రణబ్ ముఖర్జీ కన్నుమూశారంటూ: ఇదీ క్లారిటీ: అభిజిత్
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ఢిల్లీ కంటోన్మెంట్లో గల ఆర్మీ రెఫరల్ అండ్ రీసెర్చ్ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వెంటిలేటర్పైనే ఆయనకు చికిత్స కొనసాగుతోంది. హీమోడైనమికల్లీగా ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం స్థిరంగా ఉంది. ఈ పరిస్థితుల్లో.. ఆయన కన్నుమూశారంటూ సోషల్ మీడియాలో వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన ఆత్మకు శాంతి కలగాలంటూ సందేశాలను సోషల్ మీడియా ప్లాట్ఫాంలపై పోస్ట్ చేస్తున్నారు నెటిజన్లు. ఆయన ఫొటోలను పెట్టి మరీ ఈ సందేశాలను పోస్ట్ చేస్తున్నారు.
Recommended Video
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీనీ వదల్లేదు: పాజిటివ్ రిపోర్ట్: కరోనా బారిన హైప్రొఫైల్
ఈ వార్తలపై ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ క్లారిటీ ఇచ్చారు. తన తండ్రి సజీవంగా ఉన్నారని, ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోందని ప్రకటించారు. ఎలాంటి ధృవీకరణ లేకుండా ప్రణబ్ ముఖర్జీ తుదిశ్వాస విడిాచారంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారని అన్నారు. హీమోడైనమికల్గా ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని స్పష్టం చేశారు. ప్రణబ్ ముఖర్జీ కన్నుమూశారంటూ సోషల్ మీడియాలో వార్తలు వెల్లువెత్తడం పట్ల అభిజిత్ ఆగ్రహాన్ని, అసహనాన్ని వ్యక్తం చేశారు. కొందరు పేరున్న జర్నలిస్టులు కూడా ఇలాంటి తప్పుడు వార్తలను సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
భారత మీడియా తప్పుడు వార్తలను వండి వార్చుతోందని విమర్శించారు. నకిలీ వార్తలను పుట్టిస్తోందంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మీడియా.. ఫ్యాక్టరీ ఆఫ్ ఫేక్న్యూస్గా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. రిప్యుటెడ్ జర్నలిస్టులు కూడా ఇలాంటి నకిలీ వార్తలను పోస్ట్ చేయడం, కనీసం నిర్ధారించుకోకుండానే వాటిని ప్రచారం చేయడం సరికాదని అన్నారు. మీడియాలో నకిలీ వార్తలు పుట్టుకొస్తున్నాయనడానికి ఇది నిదర్శనమని అభిజిత్ ముఖర్జీ వ్యాఖ్యానించారు. తన తండ్రి ఆరోగ్యంపై ఫేక్న్యూస్ను సృష్టించడం సరికాదని చెప్పారు.
తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోన్న ప్రణబ్ ముఖర్జీ ఈ నెల 10వ తేదీన ఆర్మీ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. మెదడులో రక్తం గడ్డకట్టినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఆయనకు సర్జరీ చేశారు. అదే సమయంలో కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించగా.. పాజిటివ్గా తేలింది. ఆయనను వెంటిలేటర్పై అత్యవసర వైద్య చికిత్సను అందిస్తున్నారు ఆర్మీ ఆసుపత్రి డాక్టర్లు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యంపై వదంతులు వెల్లువెత్తూనే ఉన్నాయి. ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించిందంటూ డాక్టర్లు పేర్కొన్నారు. హీమోడైనమికల్లీ ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని తెలిపారు.
Rumours about my father is false. Request, esp’ly to media, NOT to call me as I need to keep my phone free for any updates from the hospital🙏
— Sharmistha Mukherjee (@Sharmistha_GK) August 13, 2020
మరోవైపు ప్రణబ్ కూతురు శర్మిష్ట కూడా ట్వీట్ చేశారు. తన తండ్రి ప్రణబ్ బ్రతికేఉన్నారని సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ఇక మాటిమాటికీ తన తండ్రి ఆరోగ్యం విషయమై కనుక్కునేందుకు ఫోన్ చేయకండని చెప్పిన శర్మిష్ట ముఖర్జీ... హాస్పిటల్ వర్గాల నుంచి ఫోన్లు వస్తాయని తన తండ్రి ఆరోగ్య విషయంపై ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటారని చెప్పారు. అందుకే ఇతర ఫోన్ కాల్స్ తాను తీసుకునే పరిస్థితిలో లేరన్నారు.