మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీనీ వదల్లేదు: పాజిటివ్ రిపోర్ట్: కరోనా బారిన హైప్రొఫైల్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఏ రేంజ్లో చెలరేగిపోతోందోననడానికి తాజా ఉదాహరణ ఈ ఘటన. ఏ మాత్రం ఆలక్ష్యంగా వ్యవహరించినా కరోన బారిన పడక తప్పదని హెచ్చరించే ఉదంతం ఇది. ఇప్పటికే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, ఆయన కుటుంబం వంటి హైప్రొఫైల్ ప్రముఖులను వదలని కరోనా వైరస్..తాజాగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని సోకింది. తాను కరోనా వైరస్ బారిన పడినట్లు ప్రణబ్ ముఖర్జీ వెల్లడించారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందట ఆయన ఓ ట్వీట్ చేశారు. ఫలితంగా- ఆయనను కలిసిన వారికి కరోనా వైరస్ సోకే అవకాశాలు లేకపోలేదు.
సోమవారం ఉదయం తాను ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోగా.. కరోనా వైరస్ పాజిటివ్గా తేలినట్లు ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. వారం రోజులుగా తనను కలిసిన వారు స్వీయ ఐసొలేషన్లోకి వెళ్లాని ఆయన సూచించారు. కరోనా వైరస్ వైద్య పరీక్షలను చేయించుకోవాలని విజ్ఙప్తి చేశారు. ప్రస్తుతం తన ఆరోగ్యం పరిస్థితి నిలకడగా ఉందని, ఆరోగ్యంగా ఉన్నానని స్పష్టం చేశారు. తన ఆరోగ్యం పట్ల ఎవరూ ఆందోళన చెందవద్దని ప్రణబ్ ముఖర్జీ సూచించారు. ప్రస్తుతం తాను చికిత్స తీసుకుంటున్నానని, త్వరలోనే తాను ఈ మహమ్మారి నుంచి కోలుకుంటానని అన్నారు.
ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజూ వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. సోమవారం అధికారులు విడదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. దేశంలో 62,064 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. 1007 మంది మరణించారు. ఒక్కరోజు వ్యవధిలో ఈ స్థాయిలో మరణాల సంఖ్య నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిణామాల మధ్య పలువురు ప్రముఖులు, కేంద్రమంత్రులు, రాష్ట్రాల మంత్రులు కరోనా బారిన పడుతున్నారు. కర్ణాటక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీరాములు కరోనా బారిన పడ్డారు. అమిత్ షా, అర్జున్ మేఘ్వాల్ వంటి కేంద్రమంత్రులనూ వదలట్లేదు.