కాంగ్రెస్ పతనానికి అసలు కారణాలివే- మోడీ నియంతే- ఆత్మకథలో ప్రణబ్ సంచలనాలు
ఒకప్పుడు పదేళ్ల పాటు యూపీఏ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపించిన కాంగ్రెస్ పార్టీ 2014 తర్వాత దారుణంగా పతనం అవుతూ వస్తోంది. సార్వత్రిక ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో వరుస పరాజయాలు ఆ పార్టీని కుదేలు చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్లో లుకలుకలు కూడా తీవ్రంగా సాగుతున్నాయి. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ పతనానికి గల కారణాలపై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాసిన ఆత్మకథలో పలు అంశాలు సంచలనం రేపుతున్నాయి. ముఖ్యంగా 2014 తర్వాత కాంగ్రెస్ పార్టీ దారుణ వైఫల్యం, మోడీ పాలనా విధానంపై ప్రణబ్ వ్యక్తం చేసిన అభిప్రాయాలు రాజకీయంగా రచ్చకు కారణమవుతున్నాయి.
స్వీయచరిత్రలో ప్రణబ్ సంచలనాలు..
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రాభవం తగ్గడానికి గల కారణాలను మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన ఆత్మకథ "ద ప్రెసిడెన్షియల్ ఇయర్స్" మూడో భాగంలో కుండబద్గలు కొట్టారు. ముఖ్యంగా తాను రాష్ట్రపతి అయ్యాక కాంగ్రెస్ పార్టీ ఎలా పతనమైందో ఆయన వివరించిన విధానం ఇప్పుడు సంచలనాలు రేపుతోంది. 84 ఏళ్ల ప్రణబ్ కరోనా బారిన పడి ఈ ఏడాది జూలైలో మరణించారు. అప్పటికే ఆయన రాసిన ఆత్మకథలో మూడో భాగంలో విషయాలు తాజాగా బయటికొచ్చాయి. వచ్చే నెలలో ప్రణబ్ ఆత్మకథను రూపా పబ్లిషర్స్ ప్రచురించబోతోంది. ఇందులో ప్రణబ్ వ్యక్తం చేసిన అభిప్రాయాలు కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీకి కూడా మంటపుట్టించేలా ఉన్నాయి.
కాంగ్రెస్ పతనానికి కారణాలివే...
2014 సార్వత్రిక ఎన్నికల్లో దారుణ పరాజయం తర్వాత కాంగ్రెస్ పార్టీ పతనం అయిందని అంతా భావిస్తుంటారు. కానీ తాను ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీని వీడి రాష్ట్రపతిగా వెళ్లానో అప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీ పతనం మొదలైందంటూ ప్రణబ్ తన ఆత్మకథలో చెప్పుకొచ్చారు. ఇందుకు ప్రదాన కారణం తన రాష్ట్రపతిగా వెళ్లాక సోనియగాంధీకీ, మన్మోహన్సింగ్కూ, పార్టీ ఎంపీలకు మధ్య లింక్ తెగిపోవడమే అని ప్రణబ్ పేర్కొన్నారు. అసలు 2014 సార్వత్రిక ఎన్నికల్లో పరాజయానికి సోనియా, మన్మోహన్లే కారణమని ప్రణబ్ తెలిపారు. తాను రాష్ట్రపతిగా వెళ్లిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాజకీయ దృష్టి కోల్పోయినట్లు ప్రణబ్ పేర్కొన్నారు.
2004లో తాను ప్రధాని అయ్యుంటే...
2004లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయంతో యూపీఏ సర్కారు ఏర్పాటు చేసినప్పుడు సోనియాగాంధీని విదేశీ మహిళ పేరుతో అంతా వ్యతిరేకించారు. దీంతో మన్మోహన్సింగ్ను ప్రధానిని చేశారు. అప్పట్లో తాను ప్రధానిని అయ్యుంటే 2014లో కాంగ్రెస్ పార్టీకి ఇంత దారుణ పరాజయం ఎదురయ్యేది కాదని పార్టీలో కొందరు చెప్పారని, దానికి నేను అంగీకరించనని ప్రణబ్ తన మనసులో మాటను బయటపెట్టారు. తాను రాష్ట్రపతి అయ్యాక మాత్రం కాంగ్రెస్ పార్టీ రాజకీయ దృష్టిని కోల్పోయిందని, పార్టీ వ్యవహారాలు నడిపించడంలో సోనియా దారుణంగా విఫలమయ్యారని ప్రణబ్ స్పష్టం చేశారు. 2004 నుంచి 2014 వరకూ మన్మోహన్ సింగ్ సైతం యూపీఏను రక్షించుకోవడంలోనే కాలం గడిపేశారని ప్రణబ్ ఆరోపించారు.
Recommended Video
మోడీవి నియంతృత్వ విధానాలు..
2014లో కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయం నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన నరేంద్రమోడీ ప్రభుత్వం.. ఐదేళ్ల పాటు నియంతృత్వ విధానాలనే అనుసరించిందని ప్రణబ్ విమర్శించారు. ముఖ్యంగా కార్యనిర్వహక, న్యాయ, శాసన వ్యవస్ధల మధ్య సంబంధాలు దారుణంగా చెడిపోయాయని ప్రణబ్ తెలిపారు. వచ్చే ఏదేళ్ల పాటు ఈ విషయం బహిర్గతమవుతుందేమో చూడాలంటూ తన ఆత్మకథలో ప్రణబ్ వ్యాఖ్యానించారు. తద్వారా మోడీ సర్కారు విధానాలను తాను సమర్ధించలేననేలా ప్రణబ్ వ్యాఖ్యలు ఉన్నాయి. అలాగే 2015లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత్ వచ్చినప్పుడు ఇక్కడి ప్రోటోకాల్ కు భిన్నంగా తన కారులో ప్రయాణించాలని కోరగా.. తాను తిరస్కరించినట్లు ప్రణబ్ వెల్లడించారు.