బహిరంగ సభలో కన్నీరు పెట్టుకున్న మాజీ ప్రధాని! ఆయనను చూసి కుమారుడు కూడా..!
హాసన: జనతాదళ్ (సెక్యులర్) అధినేత, మాజీ ప్రధానమంత్రి హెచ్ డీ దేవేగౌడ కన్నీరు పెట్టుకున్నారు. ఏకధాటిగా కన్నీరు కార్చారు. కర్చీఫ్ తో తుడుచుకుంటూ చాలా సేపు ఉద్విగ్నంగా ప్రసంగించారు. కర్ణాటకలోని హాసన జిల్లా హోలె నరసీపుర మండలంలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇదే సభలో పాల్గొన్న దేవేగౌడ పెద్ద కుమారుడు, కర్ణాటక మంత్రి రేవణ్ణ కూడా ఉద్వేగానికి గురయ్యారు. ఆయనా కంటనీరు పెట్టుకున్నారు.
కర్ణాటకలోని హాసన నియోజకవర్గం స్థానం నుంచి దేవేగౌడ మనవడు, రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణ లోక్ సభకు పోటీ చేయబోతున్నారు. జనతాదళ్ (ఎస్) అభ్యర్థిగా ప్రజ్వల్ ను బరిలో దింపినట్లు దేవేగౌడ ప్రకటించారు. ప్రజ్వల్ ను స్థానిక ప్రజలకు పరిచయం చేయడానికి జేడీఎస్ నాయకులు బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో దేవేగౌడ, రేవణ్ణ, ప్రజ్వల్ రేవణ్ణ సహా పలువురు నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దేవేగౌడ ప్రసంగించారు. తనను, తన కుమారులను ప్రజలు ఆశీర్వదించి, అక్కున చేర్చుకున్నారని, అలాగే తన మనవడిని కూడా ఆదరించాలని కోరారు. హాసన్ లోక్ సభ స్థానం నుంచి భారీ మెజారిటీతో గెలిపించాలని దేవేగౌడ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రైతుల అంశాన్ని దేవేగౌడ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఉత్తర కర్ణాటకలో రైతులు తీవ్ర కరవును ఎదుర్కొంటున్నారని, వ్యవసాయాన్ని వదిలేసి పొట్ట కూటి కోసం దినసరి వేతన కూలీలుగా పని చేస్తున్నారని దేవేగౌడ అన్నారు.
ఈ సందర్భంగా ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. రైతుల విషయాన్ని ప్రస్తావిస్తూనే, ఆయన గొంతు బొంగురుపోయింది. గద్గద స్వరంతో మాట్లాడారు. ఆ వెంటనే కన్నీరు పెట్టుకున్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా సరే.. అధికారంలో ఉన్నా, లేకపోయినా రైతుల సమస్యలను పరిష్కరించడమే తొలి ప్రాధాన్యతగా పెట్టుకోవాలని సూచించారు.
కన్నీటిని ఆపుకోలేకపోయిన రేవణ్ణ
తన తండ్రి కన్నీరు పెట్టుకోవడాన్ని చూసిన ఆయన పెద్ద కుమారుడు రేవణ్ణ కూడా భావోద్వేగానికి గురయ్యారు. తానూ కన్నీరు పెట్టుకున్నారు. ఆయన మాట పెగల్లేదు. ప్రసంగించాల్సిన సమయం వచ్చినప్పటికీ.. రేవణ్ణ మైకు అందుకోలేదు. దేవేగౌడ పెద్ద కుమారుడు రేవణ్ణ. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సోదరుడు. రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణను హాసన్ లోక్ సభ అభ్యర్థిగా ప్రకటించారు. తమ పార్టీ తరఫున ప్రజ్వల్ పోటీ చేస్తారని ప్రకటించారు.