ఢిల్లీ ఎయిమ్స్లో చేరిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో నొప్పి రావడంతో ఆయనను ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్త(ఎయిమ్స్)లో చేర్పించారు.
ఆదివారం రాత్రి 8.45 గంటల సమయంలో ఆయనను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం గుండె చికిత్స విభాగంలో వైద్యుల పరిశీలనలో ఉన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మన్మోహన్ సింగ్ కు ఇప్పటికే రెండుసార్లు బైపాస్ సర్జరీ జరిగింది.
కాగా, ఇటీవల మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ.. కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా లాక్డౌన్ ఎంతకాలం విధిస్తారని, ఆ తర్వాత ఏం చేస్తారని కేంద్రాన్ని ప్రశ్నించిన విషయం తెలిసిందే.
ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ.. లాక్డౌన్ 3.0 తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నామని అన్నారు. కరోనావైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు, వలస కూలీల సమస్యలు, వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని వెనక్కు తీసుకురావడానికి చర్యలపై సోనియా పార్టీ నేతలతో చర్చించారని తెలిపారు.