మోడీ సర్కార్ మూడు విషయాలను విస్మరించడంతో ఆర్థిక వ్యవస్థ క్షీణించింది:మాజీ ఆర్బీఐ గవర్నర్ వైవీ రెడ్డి
Recommended Video
న్యూఢిల్లీ: మోడీ ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోందంటే అందుకు మూడు ప్రధాన కారణాలను చెప్పారు రిజర్వ్బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ వై.వేణుగోపాల్ రెడ్డి. ఇందులో ముందు వరసలో ఉంది స్థూల జాతీయోత్పత్తి. గత ఆరు త్రైమాసికాలుగా స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)వృద్ధి రేటు క్రమంగా తగ్గుతూ వస్తుండటం ఒక కారణమైతే రెండోదిగా ఆర్థిక రంగంలో ఉన్న లోటుపాట్లపై సరైన వ్యూహంతో ముందుకెళ్లడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. మూడోదిగా ఉద్యోగాల కల్పనలో కూడా ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందని చెప్పారు వై వేణుగోపాల్ రెడ్డి.
ఇక జీడీపీ గణాంకాలు నిజంగానే క్షీణించాయని ఈ నిజాన్ని అంతా ఒప్పుకోవాల్సిందేనని వైవీ రెడ్డి అన్నారు. ఆర్థిక రంగం ఇబ్బందుల్లో ఉందన్న వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని చెప్పారు. ఇదే విషయాన్ని కాగ్ కూడా వెల్లడించిందని గుర్తు చేశారు మాజీ గవర్నర్. అంతేకాదు ఉద్యోగాల కల్పన ఆందోళనకు గురిచేస్తోందని చెప్పారు. ఈ మూడు విషయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఎక్కడో ప్రభుత్వం గాడి తప్పిందన్న విషయం స్పష్టం అవుతుందని అది ఏమిటనేది విశ్లేషించి సరిదిద్దే ప్రయత్నం చేయాలన్నారు.
ఆర్థిక పరిస్థితి క్షీణించినట్లు స్పష్టంగా కనిపిస్తుంటే మోడీ సర్కార్ మాత్రం ఈ నిజాన్ని ఒప్పుకునే పరిస్థితుల్లో లేదని వైవీ రెడ్డి అన్నారు. ఇక క్షీణించిన ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టేందుకు సంస్కరణలు తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. సంస్కరణలు తీసుకురావాలని మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని అయితే ఆ సంస్కరణలు సరిగ్గా ఉండాలని హితవు పలికారు వైవీ రెడ్డి. సంస్కరణల పేరుతో ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటే మళ్లీ అది పెద్ద చర్చకు దారి తీస్తుందన్నారు. ఆర్థిక వ్యవస్థలో లోటుబాట్లు ఉన్నాయన్న నిజాన్ని ప్రభుత్వంలో ఎవరూ ఒప్పుకోవడం లేదని అన్నారు వైవీ రెడ్డి.
ఇక ఇదే కార్యక్రమంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాల్గొని మాట్లాడారు. దేశ ఆర్ధిక పరిస్థితి ఇబ్బందుల్లో ఉందన్న విషయాన్ని మోడీ ప్రభుత్వం ఒప్పుకునేందుకు సంశయిస్తోందన్నారు. నిజంగానే ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందన్న విషయాన్ని ప్రభుత్వం ఒప్పుకొని గ్రహించి చర్యలు తీసుకుంటేనే ఈ పరిస్థితి నుంచి బయటపడతామని మన్మోహన్ సింగ్ చెప్పారు.