సమాజ్వాదీ పార్టీ మాజీ నేత రాజ్యసభ ఎంపీ అమర్ సింగ్ కన్నుమూత
లక్నో: మాజీ సమాజ్వాదీ పార్టీ నేత రాజ్యసభ ఎంపీ అమర్ సింగ్ ఇకలేరు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సింగపూర్లో చికిత్స పొందుతూ భారత కాలమాన ప్రకారం శనివారం సాయంత్రం అమర్ సింగ్ కన్నుమూశారు. మృతి చెందేనాటికి అమర్ సింగ్ వయస్సు 64 ఏళ్లు. అమర్ సింగ్ 1956లో జనవరి 27న ఉత్తర్ ప్రదేశ్లోని అలిఘర్ జిల్లాలో జన్మించారు. కోల్కతాలోని సెయింట్ క్సేవియర్స్ కాలేజ్ అండ్ యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ లా నుంచి ఎల్ఎల్బీలో డిగ్రీ చేశారు.
గత కొన్నేళ్లుగా అమర్ సింగ్ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. 2015లో ఒకసారి ఆరోగ్యం విషమించడంతో న్యూఢిల్లీలోని ఫోర్టిస్ హాస్పిటల్కు హుటాహుటిన తరలించడం జరిగింది. ఆ సమయంలో ఆయన పలు ఆరోగ్య సమస్యలతో బాధపడ్డారు. ఇక గత 10ఏళ్లుగా ఆరోగ్యసమస్యలతో బాధపడుతున్న అమర్ సింగ్కు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కూడా జరిగింది. పలు సర్జరీలు కూడా జరిగాయి. ఇదిలా ఉంటే శనివారం ఉదయం తన అభిమానులకు ట్విటర్ ద్వారా ఆయన ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాదు స్వాతంత్ర సమరయోధులు బాలగంగాధర్ తిలక్ వర్థంతి సందర్భంగా నివాళులు కూడా అర్పించారు.
అమర్ సింగ్ అకాల మరణం తనను కలచి వేసిందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అమర్ సింగ్ కుటుంబ సభ్యులకు ఉపరాష్ట్రపతి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అమర్ సింగ్ ఆత్మకు శాంతికలగాలని వెంకయ్యనాయుడు అన్నారు. మరోవైపు రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా అమర్సింగ్ మృతిపై సంతాపం తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలతో మంచి సంబంధాలు కలిగి ఉన్న అమర్ సింగ్ మరణం తనను షాక్కు గురిచేసిందని రాజ్నాథ్ సింగ్ ట్వీట్ చేశారు.
Recommended Video
Wishing a very joyous Eid Al Adha. Let's celebrate this day by spreading love and happiness. #EidMubarak #EidAladha2020
— Amar Singh (@AmarSinghTweets) August 1, 2020
అమర్ సింగ్ సమాజ్వాదీ పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేశారు. ఆ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్కు అత్యంత సన్నిహితుడిగా అమర్సింగ్ ముద్రవేసుకున్నారు. అయితే 2010లో సమాజ్వాదీ పార్టీ నుంచి అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన అమర్సింగ్ను పార్టీ సస్పెండ్ చేసింది.