భార్య హత్య కేసు, మాజీ యాంకర్కు హైకోర్టులో భారీ ఊరట, నిర్దోషిగా విడుదల
ఢిల్లీ: భార్య హత్య కేసులో మాజీ టీవీ యాంకర్ సుహేబ్ ఇల్యాసిని ఢిల్లీ కోర్టు శుక్రవారం నిర్దోషిగా విడుదల చేసింది. పద్దెనిమిదేళ్ల క్రితం భార్య హత్య కేసులో ఆయన జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. ఆయనకు ఈ రోజు కోర్టులో భారీ ఊరట లభించింది.
అతను ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ అనే కార్యక్రమంలో యాంకర్గా చేశారు. భార్య అంజు హత్య కేసులో అతనికి గత ఏడాది డిసెంబరు 16న న్యాయస్థానం శిక్ష విధించింది. ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని పేర్కొంది. తనకు శిక్ష విధించడాన్ని అతను హైకోర్టులో సవాల్ చేశారు. హైకోర్టు అతనిని నిర్దోషిగా విడుదల చేసింది.
అతని భార్య అంజు 2000 సంవత్సరం జనవరి 11న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. కత్తితో పొడిచిన గాయాలతో ఇంట్లో పడి ఉన్న ఆమెను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. కానీ ఆమె మృతి చెందింది.
కొన్ని నెలల పాటు విచారణ జరిపిన అనంతరం పోలీసులు భర్తను అదే ఏడాది మార్చి 28న అరెస్టు చేశారు. కట్నం కోసం వేధించేవాడని అంజు తల్లి, సోదరి చేసిన ఫిర్యాదుతో అతనిపై అభియోగాలు నమోదు చేశారు. ఈ కేసులో ఆయనకు గత ఏడాది జీవిత ఖైదు పడింది. ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. అతనికి ఈ ఏడాది ఆరంభంలో 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ వచ్చింది. అనారోగ్యంతో బాధపడుతున్న తన రెండో భార్యను చూసుకునేందుకు బెయిల్ వచ్చింది.