RLD చీఫ్ అజిత్ సింగ్ ఇక లేరు -కరోనా కాటుకు మరో ప్రముఖ నేత బలి -ప్రధాని మోదీ, కీలక నేతల సంతాపం
దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి ప్రమాదకరంగా సాగుతూ మరో ప్రముఖ నేతను బలి తీసుకుంది. పేరుకు ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ, మాజీ ప్రధాని తనయుడిగా, రాష్ట్రీయ లోక్దళ్(ఆర్ఎల్డీ) అధ్యక్షుడిగా దేశవ్యాప్తంగా పాపులారిటీ కలిగిన అజిత్ సింగ్ కరోనాతో కన్నుమూశారు. ఏప్రిల్ 22న కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయి, గురుగ్రామ్ లోని మేదాంత ఆస్పత్రిలో చేరిన ఆయనకు ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతినడంతో గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. చనిపోయేనాటికి ఆయన వయసు 82 ఏళ్లు.
పశ్చిమ యూపీలో వ్యవసాయ ఆధారిత సామాజికవర్గమైన జాట్లలో అజిత్ సింగ్ ఆర్ఎల్డీకి ఉన్న పట్టును గుర్తుచేస్తూ.. ''రైతుల ప్రయోజనాల కోసం అజిత్ సింగ్ అంకిత భావంతో పనిచేశారు. కేంద్రంలోనూ పలు విభాగాల్లో బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించారు. ఆయన మరణం బాధాకరం. అజిత్ సింగ్ కుటుంబీకులకు నా సంతాపం'' అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ప్రజాప్రతినిధిగా, విలక్షణ రాజకీయవేత్తగా దేశంపై అజిత్ సింగ్ ముద్ర చెరిగిపోనిదని, ఆయన మరణం బాధాకరమని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం అజిత్ మృతికి సంతాపం తెలిపారు.
భారత మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ కొడుకైన అజిత్ సింగ్.. ఐఐటీ ఖరగ్పూర్, చికాగోలోని ఇల్లినాయిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువు పూర్తయ్యాక రాజకీయాల్లోకి వచ్చారు. పీవీ నరసింహారావు కేబినెట్లో ఫుడ్ మినిస్టర్గా పనిచేసి, 1996లో కాంగ్రెస్కు రాజీనామా చేసి.. ఆర్ఎల్డీ పార్టీని స్థాపించిన అజిత్ సింగ్.. అనంతకాలంలో ఎన్డీయేలో చేరి, వాజ్పేయి ప్రభుత్వంలో వ్యవసాయమంత్రిగా పనిచేశారు. 2003 మేలో ఎన్డీయే నుంచి బయటకు వచ్చి.. మళ్లీ కాంగ్రెస్తో జతకట్టారు. 2022 యూపీ ఎన్నికలకు సిద్ధమవుతుండగా అజిత్ సింగ్ మరణం రూపంలో ఆర్ఎల్డీకి ఎదురుదెబ్బ తగిలింది.
Recommended Video
కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం వెల్లడించిన లెక్కల ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 4,12,262 కేసులు, 3,980 మరణాలు నమోదయ్యాయి. రోజువారీ కేసుల్లో ఇదొక తాజా రికార్డు. తద్వారా మొత్తం కేసులు 2,10,77,410కు, మరణాల సంఖ్య 2,30,168కి పెరిగింది. దేశంలో ఇప్పుడు యాక్టివ్ కేసుల సంఖ్య 35,66,398కు పెరిగింది. అజిత్ సింగ్ స్వరాష్ట్రం యూపీలోనూ వైరస్ విజృంభణ కొనసాగుతున్నది.