మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ కన్నుమూత
Recommended Video
న్యూఢిల్లీ: మాజీ కేంద్రమంత్రి బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జైట్లీ కొద్దిసేపటి క్రితం ఎయిమ్స్లో తుదిశ్వాస విడిచారు. అనారోగ్యకారణంగా ఆగష్టు 9న ఢిల్లీలోని ఎయిమ్స్లో అరుణ్జైట్లీ అడ్మిట్ అయ్యారు. ఇక అప్పటి నుంచి శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఎక్మో పరికరం ద్వారా ఆయనకు శ్వాసను అందిస్తున్నారు వైద్యులు.
ప్రస్తుతం ఓ వైద్య బృందం అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వచ్చింది. అయితే పరిస్థితి విషమించడంతో శనివారం 12 గంటల ఏడు నిమిషాలకు జైట్లీ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. అరుణ్ జైట్లీ ఆరోగ్యం విషమించిందని తెలియడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకునేందుకు ఉమాభారతి ఉదయమే ఎయిమ్స్కు చేరుకున్నారు.అరుణ్ జైట్లీ గత కొంతకాలంగా చాలా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో రెండు సార్లు విధుల నుంచి విరామం తీసుకున్నారు.
ఈ ఏడాది మధ్యంతర బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలో కూడా అరుణ్ జైట్లీ బాధ్యతలకు దూరంగా ఉన్నారు. ఆ సమయంలో పీయూష్ గోయల్ మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మోడీ తొలి ప్రభుత్వంలో అరుణ్ జైట్లీ ట్రబుల్ షూటర్గా వ్యవహరించారు. ఆర్థిక శాఖ మంత్రిగానే కాకుండా కొన్ని రోజుల పాటు రక్షణశాఖ బాధ్యతలను కూడా నిర్వర్తించారు అరుణ్ జైట్లీ. అయితే 2019 లోక్సభ ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. అనారోగ్యకారణంగా పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. అంతేకాదు తనను క్యాబినెట్లోకి తీసుకోరాదని మోడీని ప్రత్యేకంగా కోరారు అరుణ్ జైట్లీ.
ఇక అరుణ్ జైట్లీకి 2018లో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జరిగింది. ఇక అప్పటి నుంచే అతని ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. అంతకుముందు అంటే 2014లో అరుణ్ జైట్లీ బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నారు. మధుమేహంతో అధిక బరువు ఉండటంతో ఈ సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. ఇక ప్రధాని మోడీకి కుడి భుజంగా వ్యవహరించారు జైట్లీ. ఆర్థిక శాఖనే కాకుండా ఇతర శాఖలను కూడా అరుణ్ జైట్లీ చాలా సమర్థవంతంగా నిర్వర్తించారు జైట్లీ. ఆర్థికశాఖ మంత్రిగా నరేంద్ర మోడీ తొలి ప్రభుత్వంలో అన్ని బడ్జెట్లను ప్రవేశపెట్టారు.