కేంద్ర మాజీమంత్రి జస్వంత్ సింగ్ కన్నుమూత: స్ట్రాంగ్ మ్యాన్: ప్రధాని మోడీ సంతాపం
న్యూఢిల్లీ: కేంద్ర మాజీమంత్రి జస్వంత్ సింగ్ కన్నుమూశారు. ఆయన వయస్సు 82 సంవత్సరాలు. మాజీ ప్రధానమంత్రి, దివంగత అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో ఆయన కీలక శాఖలకు ప్రాతినిథ్యాన్ని వహించారు. కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. జస్వంత్ సింగ్ మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు కేంద్ర కేబినెట్ మంత్రులు, భారతీయ జనతా పార్టీ నేతలు సంతాపాన్ని వ్యక్తం చేశారు.
గుండెపోటుతో..
తీవ్ర అనారోగ్యం బారిన పడిన ఆయన జూన్ 25వ తేదీన దేశ రాజధానిలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫెరల్ ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్నారు. ఆయన సెప్సిస్తో బాధపడుతున్నట్లు నిర్ధారించారు డాక్టర్లు. క్రమంగా అవయవాలు పని చేయడం మానేశాయని పేర్కొన్నారు. మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్ సిండ్రోమ్కు గురయ్యారని తెలిపారు. ఆయనకు చికిత్స కొనసాగిస్తోన్న సమయంలో ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుకు గురయ్యారని వెల్లడించారు. 6:55 నిమిషాలకు తుదిశ్వాస విడిచినట్లు ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరెల్ ఆసుపత్రి డాక్టర్లు వెల్లడించారు. ఆయనకు కరోనా వైరస్ వైద్య పరీక్షలు నిర్వహించగా.. నెగెటివ్ రిపోర్ట్ వచ్చినట్లు పేర్కొన్నారు.
స్ట్రాంగ్ మ్యాన్గా
రాజస్థాన్లోని బార్మర్ జిల్లా జసోల్లో 1938లో జస్వంత్ సింగ్ జన్మించారు. ఇండియన్ మిలటరీ అకాడమీలో చదువుకున్నారు. అనంతరం ఆర్మీలో చేరారు. మేజర్ ర్యాంక్ హోదాలో పని చేశారు. ఆర్మీ నుంచి వచ్చిన తరువాత. భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ వ్యవస్థాపక నాయకుల్లో జస్వంత్ సింగ్ ఒకరు. రాజస్థాన్లోని బార్మర్-జైసల్మీర్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. వాజ్పేయి ప్రభుత్వంలో.. కీలకమైన విదేశాంగ, ఆర్థిక, రక్షణశాఖ మంత్రిగా పనిచేశారు. అవుట్ స్టాండింగ్ పార్లమెంటేరియన్ అవార్డును అందుకున్నారు.
బీజేపీ నుంచి బయటికి
యూపీఏ హయాంలో రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. 2014 లోక్సభ ఎన్నికల్లో జస్వంత్ సింగ్కు టికెట్ లభించలేదు. ఆయనకు టికెట్ ఇవ్వడానికి బీజేపీ అధిష్ఠానం నిరాకరించింది. ఆ సమయంలో ఆయన బీజేపీ అధిష్ఠానంపై ఘాటు వ్యాఖ్యలు చేయడంతో.. ఆయనను బహిష్కరించింది పార్టీ. అనంతరం తనకు గట్టి పట్టు ఉన్న బార్మర్-జైసల్మేర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. బీజేపీ అభ్యర్థి కల్నల్ సోనారామ్ చౌధరి చేతిలో ఓటమి పాలయ్యారు.
Recommended Video
భారతీయ జనతా పార్టీ బలోపేతం కావడానికి
రాజస్థాన్లో భారతీయ జనతా పార్టీ బలోపేతం కావడానికి జస్వంత్ సింగ్ అవిరళంగా కృషి చేశారని పేర్కొన్నారు. రక్షణశాఖ మంత్రిగా సరిహద్దులను కాపాడటంలో అహర్నిశలు ప్రయత్నించారని ప్రధానమంత్రి తన సంతాప సందేశంలో తెలిపారు. తన జీవితాన్ని దేశం కోసం అర్పించారని, ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమైనవని చెప్పారు. ఆర్థిక, విదేశాంగం, రక్షణశాఖలను బలోపేతం చేయడానికి జస్వంత్ సింగ్ తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తుకు బాటలు వేశాయని అన్నారు. ఆయా శాఖలపై జస్వంత్ సింగ్ తనదైన ముద్ర వేశారని చెప్పారు.