ఇంటి భోజనం తినాలనిపిస్తోంది: అనుమతి ఇవ్వాలంటూ చిదంబరం పిటీషన్
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన కేంద్ర మాజీమత్రి పీ చిదంబరానికి ఇంటి భోజనంపై మనసు పడ్డారు. ఆరోగ్య కారణాలను దృష్టిలో ఉంచుకుని తనకు ఇంటి నుంచి భోజనాన్ని తెప్పించుకునే సౌకర్యాన్ని కల్పించాలని ఆయన న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. చిదంబరం తరఫు న్యాయవాది ట్రయల్ కోర్టుకు ఓ దరఖాస్తును దాఖలు చేశారు. దీనిపై విచారణను ఈ నెల 3వ తేదీకి వాయిదా వేసింది న్యాయస్థానం. అదే రోజు చిదంబరం జ్యుడీషియల్ కస్టడీ ముగిబోతుండటం గమనార్హం.
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సీబీఐ అధికారులు ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చిదంబరం తీహార్ జైలులో విచారణను ఎదుర్కొంటున్నారు. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. నిజానికి ఆయన జ్యుడీషియల్ కస్టడీ ఈ నెల 19వ తేదీన ముగిసింది. సీబీఐ అధికారుల విజ్ఞప్తి మేరకు కస్టడీని పొడిగించింది న్యాయస్థానం. ఈ నెల 3వ తేదీ వరకు కస్టడీలోనే కొనసాగాలని ఆదేశించింది. ప్రస్తుతం ఆయన తీహార్ జైలులోనే ఏడో నంబర్ కాంప్లెక్స్ లో విచారణను ఎదుర్కొంటున్నారు.
3వ తేదీతో జ్యుడీషియల్ కస్టడీ ముగియబోతోంది. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటిదాకా రెండు దఫాలుగా కస్టడీలోకి తీసుకుని చిదంబరాన్ని విచారించినప్పటికీ.. ఎలాంటి కీలకమైన సమాచారాన్ని గానీ, డాక్యుమెంట్లను గానీ అధికారులు స్వాధీనం చేసుకోలేకపోయారంటూ చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం విమర్శిస్తున్నారు.
కాంగ్రెస్ కు షాక్: మేయర్ పదవి కూడా పాయే: ఎగిరిన కాషాయ జెండా
నెలరోజులుగా కస్టడీలో ఉన్నా, తన తండ్రి అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు ఒక్క సాక్ష్యాధారాన్ని కూడా అధికారులు సాధించలేకపోయారని, దీన్ని బట్టి ఉద్దేశపూరకంగా, రాజకీయ కారణాలతోనే కేసు బనాయించారనే విషయం స్పష్టమౌతోందని కార్తీ చిదంబరం అన్నారు. మరో రెండురోజుల్లో కస్టడీ ముగియనున్న నేపథ్యంలో దీన్ని న్యాయస్థానం మళ్లీ పొడిగించకపోవచ్చని, పొడిగించడానికి గల సరైన కారణాలు కూడా లేవని ఆయన అభిప్రాయపడ్డారు.