కేంద్ర మాజీమంత్రి కన్నుమూత: జాతీయ ఉపాధి హామీ పథకం ఆయన చలవే: బ్రెయిన్ ఛైల్డ్గా
న్యూఢిల్లీ: రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) మాజీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి రఘువంశ్ ప్రసాద్ సింగ్ కొద్దిసేపటి కిందట కన్నుమూశారు. శనివారం తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయనను దేశ రాజధానిలోని అఖిల భారత వైద్య విజ్ఙాన సంస్థ (ఎయిమ్స్లో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆసుపత్రిలో చేరినప్పటి నుంచీ ఆయనను వెంటిలేటర్పై ఉంచారు. అత్యాధునిక వైద్య చికిత్సను అందించారు. ఆయన ఆరోగ్యం విషమించడంతో కన్నుమూశారు.
కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో ఆయన కేంద్ర మంత్రివర్గంలో కొనసాగారు. మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ హయాంలో పలు కీలక శాఖలకు ప్రాతినిథ్యాన్ని వహించారు. గ్రామీణస్థాయిలో కోట్లాదిమందికి ఉపాధిని కల్పిస్తోన్న జాతీయ ఉపాధి హామీ పథకానికి రూపకర్తగా రఘువంశ్ ప్రసాద్ సింగ్కు పేరుంది. ఈ పథకం ఆయన బ్రెయిన్ఛైల్డ్గా అభివర్ణిస్తుంటారు. బిహార్లోని వైశాలి లోక్సభ స్థానం నుంచి అయిదుసార్లు ఘన విజయాన్ని సాధించారు. 2014, 2019 ఎన్నికల్లో ఓటమి చవి చూశారు.
కొద్దిరోజుల కిందటే ఆయన ఆర్జేడీకి గుడ్బై చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేశారు. భవిష్యత్తులో ఆయన ఏ పార్టీలో చేరతారనే చర్చ ప్రస్తుతం బిహార్లో నడుస్తోంది. అదే సమయంలో ఆయన అనారోగ్యానికి గురయ్యారు. ఆసుపత్రిలో చేరిన మరుసటి రోజే తుదిశ్వాస విడిచారు. మాజీ సహచరుడి మరణం పట్ల లాలూ ప్రసాద్ యాదవ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సంతాపాన్ని తెలిపారు. రఘువంశ్ మరణం తనను కలచి వేస్తోందంటూ ఆయన ట్వీట్ చేశారు.
प्रिय रघुवंश बाबू! ये आपने क्या किया?
— Lalu Prasad Yadav (@laluprasadrjd) September 13, 2020
मैनें परसों ही आपसे कहा था आप कहीं नहीं जा रहे है। लेकिन आप इतनी दूर चले गए।
नि:शब्द हूँ। दुःखी हूँ। बहुत याद आएँगे।
Recommended Video
తన ఆప్పుడిని, రాజకీయాల్లో అత్యంత నమ్మకస్తుడైన మిత్రుడిని కోల్పోయానని లాలూ ప్రసాద్ యాదవ్ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. రఘువంశ్ మరణం పట్ల బిహార్ ప్రభుత్వం సంతాపాన్ని తెలిపింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆయన లేని లోటు తీర్చలేనిదని పేర్కొన్నారు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఓ మంచి నాయకుడిని బిహార్ కోల్పోయిందని అన్నారు. పలువురు కేంద్రమంత్రులు సంతాపాన్ని తెలిపారు.