మనవరాలిని లైంగిక వేధించారనే ఆరోపణలు: మాజీ మంత్రి రాజేంద్ర ఆత్మహత్య
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ మాజీ మంత్రి, రోడ్వేస్ యూనియన్ నాయకుడు రాజేంద్ర బహుగుణ హల్ద్వానీ నగరంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బహుగుణ తన మనవరాలిని వేధించాడని అతని కోడలు ఆరోపించిన నేపథ్యంలో మనస్తాపానికి గురైన రాజేంద్ర ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
బుధవారం హల్ద్వానీలోని భగత్ సింగ్ కాలనీలో మాజీ మంత్రి నీటి ట్యాంక్ పైకి ఎక్కి తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
రాజేంద్ర బహుగుణ(59)పై అతని కోడలు చేసిన ఫిర్యాదు ఆధారంగా లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ (పోక్సో) చట్టం కింద కేసు నమోదు చేసినట్లు నైనిటాల్ సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ పకాజ్ భట్ తెలిపారు.
వాటర్ ట్యాంక్ పైకి వెళ్ళే ముందు తన ఆత్మహత్య ప్రణాళిక గురించి పోలీసులకు ఫోన్ చేసి చెప్పారు రాజేంద్ర బహుగుణ. పోలీసులు వచ్చేసరికి ట్యాంక్పై నిలబడి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారు.
లౌడ్ స్పీకర్లతో మాట్లాడి రాజేంద్రను కాపాడాలని పోలీసులు ప్రయత్నించినప్పటికీ.. తన నిర్ణయం మార్చుకోలేదు మాజీ మంత్రి. అయితే, ఆత్మహత్య చేసుకునే ముందు తాను ఎలాంటి వేధింపులకు పాల్పడలేదని, తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని రాజేంద్ర పోలీసులకు తెలిపారు. ఆ తర్వాత పోలీసులు, స్థానికులు చూస్తుండగానే రాజేంద్ర తన వద్ద ఉన్న తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే రాజేంద్ర మృతి చెందాడని వైద్యులు తేల్చారు. తాను తన మనవరాలిపై ఎలాంటి వేధింపులకు పాల్పడలేదని చనిపోయే ముందు రాజేంద్ర బహుగుణ చెప్పారని ఎస్ఎస్పీ తెలిపారు.
ఇది ఇలావుండగా, తన తండ్రి ఆత్మహత్యకు కారణమైన తన భార్యపై చర్యలు తీసుకోవాలని బహుగుణ కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, రాజేంద్ర బహుగుణ 2004-05 మధ్య కాలంలో కాంగ్రెస్ నేత, ఎన్డీ తివారీ ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు.