ఆస్పత్రి అమానుషం: డెంగ్యూతో చిన్నారి మృతి, రూ.16లక్షల బిల్లు వేసింది
Recommended Video
న్యూఢిల్లీ: గురుగ్రాంలోని ఓ ఆస్పత్రి అమానుషంగా ప్రవర్తించింది. డెంగ్యూ జ్వరంతో ఆసుపత్రిలో చేరిన బాలిక చికిత్స పొందుతూ మరణించింది. ఆ చిన్నారి ప్రాణాలు కాపాడలేకపోయినా.. ఆస్పత్రి యాజమాన్యం మాత్రం రెండు వారాల చికిత్సకు ఏకంగా రూ.16 లక్షల బిల్లు వేయడం శోచనీయం.
ఆద్యను కాపాడలేకపోయిన ఆస్పత్రి
వివరాల్లోకి వెళితే.. ద్వారకకు చెందిన ఐటీ ఉద్యోగి జయంత్ సింగ్ డెంగ్యూతో బాధపడుతున్న తన ఏడేళ్ల కుమార్తె ఆద్యా సింగ్ను గురుగ్రామ్లోని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్లో చేర్చారు. రెండు వారాల చికిత్స తర్వాత పరిస్థితి విషమించడంతో ఆద్య కన్నుమూసింది.
ఐనా రూ.16లక్షల బిల్లు
కాగా, ఆ ఆస్పత్రి యాజమాన్యం.. 15 రోజులపాటు సదరు చిన్నారికి అందించిన వైద్య సేవలకు గాను ఏకంగా రూ. 15.79 లక్షల బిల్లును జయంత్ సింగ్ చేతికిచ్చింది. తమ పాప లేదని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న ఆ తల్లిదండ్రులను ఈ చర్య విస్తుపోయేలా చేసింది. ఆసుపత్రి ఇచ్చిన బిల్లులో నర్సులు ఉపయోగించిన 2700 గ్లోవ్స్కు బిల్లు వేయడం గమనార్హం.
అంతా షాక్
అయితే, ఆసుపత్రి బిల్లు చెల్లించేందుకు జయంత్ రూ. 5 లక్షల పర్సనల్ లోన్ తీసుకున్నారు. కుటుంబ సభ్యులు, తెలిసినవారు, ఇతరుల నుంచి మరికొంత తీసుకున్నారు. ఆసుపత్రి బిల్లు చూసి నిశ్చేష్టుడైన బాలిక తండ్రి దానిని ట్విట్టర్లో పెట్టడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ట్వీట్ 10 వేల సార్లు రీ ట్వీట్ అయింది.
కేంద్రమంత్రి ఆగ్రహం
ఆసుపత్రి తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో కేంద్ర ఆరోగ్య మంత్రి నడ్డా రంగంలోకి దిగారు. ఆసుపత్రిపై చర్యలు తీసుకుంటామని, అందుకు సంబంధించిన వివరాలు పంపాలని ట్వీట్ చేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కాగా, తమపై వస్తున్న ఆరోపణలు, విమర్శలను ఫోర్టిస్ ఆసుపత్రి యాజమాన్యం ఖండించింది. తామేమీ తప్పుచేయలేదని చెబుతోంది.