అనురాగ్,తాప్సీలకు 135 ప్రశ్నలు.. రూ.650కోట్ల లావాదేవీల్లో అవకతవకలు... ఐటీ సోదాలపై షాకింగ్ వివరాలు
బాలీవుడ్ సినీ దర్శకుడు అనురాగ్ కశ్యప్,నటి తాప్సీ పన్ను,నిర్మాతలు మధు మంతెన,వికాస్ భల్ కార్యాలయాలు,ఇళ్లపై దాడులు చేసిన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తాజాగా ఆ వివరాలు వెల్లడించింది. ఫాంటమ్ ఫిలింస్ ప్రొడక్షన్ కంపెనీకి సంబంధించిన రూ.300కోట్ల లావాదేవీల్లో అవకతవకలు గుర్తించినట్లు తెలిపింది. మరో రూ.350 కోట్ల లావాదేవీకి సంబంధించి ట్యాక్స్ చెల్లింపుల్లో అవకతవకలు గుర్తించినట్లు వెల్లడించింది. ఈ వ్యవహారంలో నటి తాప్సీ నుంచి రూ.5కోట్ల నగదు రిసిప్ట్ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పింది.
మరో రూ.20కోట్ల బోగస్ వ్యయం...
ఆ రూ.650కోట్లు కాకుండా మరో రూ.20కోట్ల బోగస్ వ్యయానికి సంబంధించిన డాక్యుమెంట్స్ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. ప్రస్తుతం ఇంకా సోదాలు కొనసాగుతున్నాయని తెలిపింది. ఇప్పటివరకూ వెలుగుచూసిన ఆర్థిక లావాదేవీల్లోని అవకతవకలపై తదుపరి విచారణ కొనసాగుతుందని చెప్పింది. బుధవారం(మార్చి 3) నుంచి పుణే,ముంబై సహా మొత్తం 28 ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. ఫాంటమ్ ఫిలింస్ ప్రొడక్షన్ కంపెనీతో లింకులున్న దర్శకులు,నిర్మాతలు,నటీనటుల ఇళ్లపై సోదాలు జరుగుతున్నాయి.
అనురాగ్,తాప్సీలకు 135 ప్రశ్నలు
ప్రస్తుతం పుణేలో 'దొబారా' మూవీ షూటింగ్లో ఉన్న దర్శకుడు అనురాగ్ కశ్యప్,నటి తాప్సీ పన్నులను ఐటీ అధికారులు విచారించారు. వారి ల్యాప్టాప్స్,ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ను వారు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరి విచారణ కోసం ఐటీ అధికారులు మొత్తం 135 ప్రశ్నలను సిద్దం చేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కశ్యప్,తాప్సీ పెట్టుబడులు,లావాదేవీలు,పలువురు నిర్మాతలు,ప్రొడక్షన్ కంపెనీలతో వారికి ఉన్న ఆర్థిక సంబంధాలపై వారి నుంచి వివరాలు రాబడుతున్నట్లు సమాచారం.
అందుకే టార్గెట్ చేస్తున్నారన్న రాహుల్
కశ్యప్,తాప్సీలతో పాటు దర్శకుడు విక్రమాదిత్య మోత్వానీ, నిర్మాతలు మధు మంతెన,వికాస్ భల్,రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సీఈవో శిభాషిష్ సర్కార్, ఎక్సీడ్ కంపెనీ సీఈవో అఫ్సర్ జైదీ,క్వాన్ కంపెనీ సీఈవో విజయ్ సుబ్రహ్మణ్యమ్ కార్యాలయాలు,నివాసాలపై కూడా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఈ ఐటీ సోదాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. రైతులకు మద్దతుగా నిలుస్తున్నవారి పైనే ఐటీ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నిజాలు మాట్లాడేవారి నోళ్లు మూయించేందుకే ఇలా ఐటీని ప్రయోగిస్తున్నారని ఆరోపించారు.
కొట్టిపారేస్తున్న కేంద్రం...
మరోవైపు కేంద్ర ప్రభుత్వ వర్గాలు మాత్రం ప్రతిపక్ష నేతల ఆరోపణలను కొట్టిపారేస్తున్నాయి. తమకున్న విశ్వసనీయ సమాచారం మేరకు ఐటీ సంస్థలు సోదాలు నిర్వహిస్తాయని... అంతే తప్ప ఇందులో తమ ప్రమేయం ఏమీ లేదని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. కాగా,సామాజిక అంశాలపై స్పందించడంలో దర్శకుడు కశ్యప్,నటి తాప్సీ ఎప్పుడూ ముందుంటారన్న సంగతి తెలిసిందే. రైతు ఉద్యమానికి మద్దతు ప్రకటించిన తాప్సీ... విదేశీ సెలబ్రిటీల మద్దతును తప్పు పట్టిన దేశీ సెలబ్రిటీలపై ఫైర్ అయిన సంగతి తెలిసిందే. ఇక కశ్యప్ గతంలో సీఏఏ వ్యతిరేక ఉద్యమానికి మద్దతుగా నిలిచారు. ఢిల్లీలోని షాహీన్ బాగ్,జేఎన్యూ వర్సిటీలకు వెళ్లి సంఘీభావం ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వీరిని కావాలనే టార్గెట్ చేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.