ఫేస్బుక్-భజరంగ్దళ్ వివాదం.. నిలదీసిన పార్లమెంటరీ ప్యానెల్.. ఒకవేళ ఆ ఆర్టికల్ ఫేక్ అయితే..?
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ రైట్ వింగ్ గ్రూప్ అయిన భజరంగ్ దళ్ పట్ల ఉదాసీన వైఖరిని ప్రదర్శిస్తోందా... ఆ సంస్థ ఫేస్బుక్ నిబంధనలను ఉల్లంఘించినా చూసీ చూడనట్లు వదిలేస్తోందా..? బుధవారం(డిసెంబర్ 16) పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఫేస్బుక్ ప్రతినిధికి ఇవే ప్రశ్నలు వేసింది. దానికి ఫేస్బుక్ ప్రతినిధి... భజరంగ్దళ్పై చర్యలకు తమకెటువంటి కారణాలు కనిపించట్లేదని... ఆ సంస్థ సోషల్ మీడియా పాలసీని ఉల్లంఘించినట్లు ఇంతవరకూ ఫేస్బుక్ ఫ్యాక్ట్ చెక్ టీమ్ నిర్దారించలేదని స్పష్టం చేయడం గమనార్హం.
ప్యానెల్ ఏం అడిగింది...
దేశంలో ఫేస్బుక్ వినియోగదారుల డేటా భద్రతకు సంబంధించిన అంశంపై విచారణలో భాగంగా ఆ సంస్థ భారత్ హెడ్ అజిత్ మోహన్ బుధవారం ఎంపీ శశి థరూర్ నేత్రుత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా భారత్లో పౌర హక్కుల రక్షణ,ఆన్లైన్ న్యూస్ ప్లాట్ఫామ్స్ దుర్వినియోగం,ఫేస్బుక్లో మహిళల సెక్యూరిటీ తదితర అంశాలపై ప్యానెల్ ఫేస్బుక్ హెడ్ను ప్రశ్నించింది. అలాగే భజరంగ్దళ్పై అందిన అంతర్గత నివేదిక విషయంలో ఫేస్బుక్ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్యానెల్ ప్రశ్నించింది.
ఒకవేళ ఆ ఆర్టికల్ ఫేక్ అయితే...
భారత్లో భజరంగ్దళ్ ఒక ప్రమాదకర సంస్థ అని ఫేస్బుక్కి అంతర్గత నివేదిక అందిందని.. ఢిల్లీలో చర్చిపై దాడికి తామే బాధ్యులమని ఆ సంస్థ ప్రకటించుకుందని.. అయినప్పటికీ ఫేస్బుక్ మాత్రం ఆ సంస్థపై చర్యలకు వెనుకాడుతోందని వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన కథనాన్ని కూడా విచారణలో పార్లమెంటరీ ప్యానెల్ ప్రస్తావించింది. అయితే అదంతా ఫేక్ న్యూస్ అని అజిత్ మోహన్ కొట్టిపారేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన ఆ ఆర్టికల్ ఫేక్ అయితే... దానిపై ఫేక్ ముద్ర ఎందుకు వేయలేదని ప్యానెల్ ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు ఫేస్బుక్ ఏం సమాధానం చెప్పిందో తెలియరాలేదు.
ప్రభుత్వ అనుకూల పోస్టులకు ఎక్కువ రీచ్?
విద్వేషపూరిత పోస్టులపై ఫేస్బుక్ సొంతంగా చర్యలు తీసుకోలేదా అని కూడా పార్లమెంటరీ ప్యానెల్ అజిత్ మోహన్ను ప్రశ్నించింది. ఒకవేళ ఎవరైనా దానిపై ఫిర్యాదు చేసినా.. అప్పటికే దానివల్ల జరగాల్సిన నష్టం జరిగి ఉంటుంది కదా అని నిలదీసింది. అంతేకాదు,ప్రభుత్వ అనుకూల పోస్టులు,వార్తలకు ఉన్నంత రీచ్.. వ్యతిరేక పోస్టులకు,వార్తలకు ఎందుకు లేదని ప్యానెల్ ఫేస్బుక్ని ప్రశ్నించింది. భారత్లో ఆ సంస్థకు చెందిన 268 మంది ఉద్యోగుల నేపథ్యానికి సంబంధించిన వివరాలు కోరింది. ఫేస్బుక్ మాత్రం తమ వేదిక పారదర్శకంగా పనిచేస్తోందని... ప్రతీ ఒక్కరూ తమ భావాలను వెల్లడించే స్వేచ్చను ఇస్తుందని చెప్పడం గమనార్హం. ఇకముందు కూడా తాము అలాగే పనిచేస్తామని పేర్కొంది.
Recommended Video
గతంలో రాజాసింగ్ ఖాతాపై నిషేధం...
అంతర్గత నివేదిక ఆధారంగా ఫేస్బుక్ భజరంగ్దళ్పై నిషేధం విధించాలని భావించినప్పటికీ... భారత్లో తమ వ్యాపార కార్యకలాపాలు దెబ్బతింటాయన్న భయంతో,సిబ్బందిపై దాడులు జరగవచ్చునన్న భయంతో సోషల్ మీడియా దిగ్గజం వెనక్కి తగ్గినట్లుగా వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించింది. గతంలో తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్న కారణంతో ఫేస్బుక్ ఆయన ఖాతాపై నిషేధం విధించింది. అయితే అప్పటి సౌత్ ఏసియా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ అంకి దాస్ ఈ నిషేధానికి అడ్డుపడ్డారన్న ప్రచారం ఉంది. రాజాసింగ్పై నిషేధం విధిస్తే భారత్లో ఫేస్బుక్ వ్యాపార ప్రయోజనాలు దెబ్బతింటాయని ఆయన వారించినట్లు కథనాలు వచ్చాయి. కానీ ఎట్టకేలకు రాజాసింగ్ ఖాతాపై నిషేధం తప్పలేదు.