అయోధ్య మసీదుకు రిపబ్లిక్ డే రోజు శంఖుస్ధాపన- బాబ్రీ కంటే పెద్దగా- 2వేల మంది పట్టేలా
అయోధ్యలో దశాబ్దాలుగా నెలకొన్న రామాలయం-బాబ్రీ మసీదు వివాదానికి సుప్రీంకోర్టు తీర్పుతో తెరపడిన నేపథ్యంలో అటు మందిర్, ఇటు మసీదు కోసం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో అయోధ్య రామమందిర నిర్మాణానికి పునాది పడనుండగా.. ఇటు మసీదు కోసం వేగంగా అడుగులు పడుతున్నాయి. మసీదుకు కేటాయించిన ఐదు ఎకరాల స్ధలంలో త్వరలో నిర్మాణం ప్రారంభం కానుంది.
అయోధ్యలోని దన్నీపూర్ గ్రామంలో మసీదు కోసం కేటాయించిన ఐదు ఎకరాల్లో అద్భుతమైన మసీదు నిర్మాణానికి బ్లూ ప్రింట్ సిద్దమైంది. దీన్ని ఈ శనివారం మసీదు కమిటీ విడుదల చేయబోతోంది. దీని ప్రకారం వచ్చే నెల 26న రిపబ్లిక్ డే సందర్భంగా మసీదు నిర్మాణానికి శంఖుస్ధాపన జరుగుతుందని మసీదు కమిటీ ప్రకటించింది.
ఏడు దశాబ్దాల క్రితం రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు మసీదు నిర్మాణానికి శంఖుస్ధాపన చేస్తామని మసీదు కమిటీ వెల్లడించింది. రాజ్యాంగం ప్రవచించిన భిన్నత్వ వాదనను తాము నమ్ముతామని మసీదు నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ తెలిపింది.
అయోధ్య మసీదు కాంప్లెక్స్లో మసీదుతో పాటు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి, కమ్యూనిటీ కిచెన్, లైబ్రరీ కూడా ఉండబోతున్నాయి. ఈ నెల 19న విడుదల చేసే బ్లూ ప్రింట్లో వీటిని పొందుపరిచారు. ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ ప్రొఫెసర్ ఎస్.ఎమ్ అఖ్తర్ ఈ బ్లూ ప్రింట్ తయారు చేశారు.
Recommended Video
మసీదు ఆకారం గుండ్రంగా ఉంటుందని, ఏకకాలంలో 2 వేల మంది నమాజ్ చేసుకునేందుకు వీలుగా నిర్మిస్తామని ఆర్కిటెక్ట్ తెలిపారు. ఈ మసీదు బాబ్రీ మసీదు కంటే పెద్దదిగా ఉంటుందని, దాని పోలికలే ఉండవని వెల్లడించారు. ఈ కాంప్లెక్స్లో నిర్మించే ఆస్పత్రి సైతం 1400 ఏళ్ల క్రితం మహమ్మద్ ప్రవక్త సూచించిన విధానం ఆధారంగా పనిచేస్తుందన్నారు. ఇందులో 300 పడకలు ఉంటాయన్నారు.