అగ్ని ప్రమాదం: నలుగురు సజీవ సమాధి
న్యూఢిల్లీ: న్యూఢిల్లీలో శుక్రవారం నాడు జరిగిన అగ్నిప్రమాదంలో ఓ కుటుంబం సజీవదహనమైంది. విద్యుత్ షార్ట్సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం చోటు చేసుకొందని అధికారులు ప్రకటించారు. శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరగడంతో నిత్రలోనే నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
న్యూఢిల్లీలోని కోహట్ ఎన్క్లేవ్ వద్ద ఓ అపార్ట్మెంట్లో మంటలు చెలరేగడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం తెల్లవారుజామున 2:48 సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి.
మంటలు వ్యాపించిన విషయాన్ని గుర్తించిన స్థానికులు సహయక చర్యలను చేపట్టారు. ఫైరింజన్లు వచ్చాయి. అయితే అప్పటికే నలుగురు సజీవ దహనమయ్యారు. మరో ముగ్గురిని స్థానికులు రక్షించారు. తీవ్రంగా గాయపడడంతో వారిని అంబేద్కర్ ఆసుపత్రికి తరలించారు.
మృతి చెందినవారిలో ఇద్దరు దంపతులతో పాటు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో వీరంతా మొదటి అంతస్థులోని తమ ఫ్లాట్లో నిద్రపోతున్నారు.
కింద నుండి పొగలు రావడంతో బయటకు వచ్చేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదని ఘటన స్థలంలోని ఆధారాలను బట్టి పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.