బర్ఖాదత్ కు అశ్లీల ఫొటోలు పంపిన కేసులో నలుగురి అరెస్టు
న్యూఢిల్లీ: ప్రముఖ జర్నలిస్ట్ బర్ఖాదత్ ను ఆన్ లైన్ ద్వారా వేధింపులకు గురి చేసిన కేసులో ఢిల్లీ పోలీసులు పురోగతి సాధించారు. నలుగురిని అరెస్టు చేశారు. వారిలో ముగ్గురు ఢిల్లీకి చెందిన వారు కాగా.. మరొకరు గుజరాత్ లోని సూరత్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతిపురా వద్ద కిందటి నెల 14వ తేదీన చోటు చేసుకున్న జైషె మహమ్మద్ ఉగ్రవాదుల దాడి అనంతరం.. బర్ఖాదత్ ఆన్ లైన్ ద్వారా వేధింపులకు గురయ్యారు.
ఎన్డీటీవీ విశ్లేషణ : యూపీ కోటాలో బీజేపీకి బీటలు, దెబ్బకొడుతోన్న ఎస్పీ, బీఎస్పీ కూటమి
గుర్తు తెలియని వ్యక్తులు ఆమెకు వాట్సప్ ద్వారా అశ్లీలకరమైన ఫొటోలు పంపించారు. మెసేజ్ చేశారు. అత్యాచారం చేసి, హతమారుస్తామంటూ ఫోన్లు చేసి బెదిరించారు. దీనితో ఆమె ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. తనకు వచ్చిన అశ్లీల ఫొటోలు, మెసేజీలను సాక్ష్యాధారాలుగా చూపుతూ ఫిర్యాదు చేశారు. దీనిపై ఢిల్లీ సైబర్ క్రైమ్ విభాగం పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టారు.
పుల్వామా ఉగ్రదాడి అనంతరం.. బర్ఖాదత్ ఓ బాధ్యత గల జర్నలిస్టుగా కాకుండా, తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తోందనే కారణంతో ఆమెను వేధింపులకు గురి చేశారనే ఆరోపణలు ఈ నలుగురిపై ఉన్నాయి. హత్య చేస్తామంటూ ఫోన్ చేసి, బెదిరించడం వెనుక కూడా ఇలాంటి కారణాలే ఉంటాయని పోలీసులు అనుమానించారు. ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు. బర్ఖాదత్ కు వచ్చిన ఫోన్ కాల్స్, మెసేజీలు, అశ్లీల ఫొటోలను పంపిన వాట్సప్ నంబర్ ద్వారా ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
దీనికి కారణమైన నలుగురిని అరెస్టు చేశారు. ఢిల్లీకి చెందిన రాజీవ్ శర్మ, హేమ్ రాజ్ కుమార్, ఆదిత్య కుమార్ తో పాటు సూరత్ నివాసి షబ్బీర్ గుర్ఫాన్ పింజరీని అరెస్టు చేశారు. వారిపై సైబర్ క్రైమ్ కింద కేసు నమోదు చేశారు. వారిని న్యాయస్థానం ఎదుట హాజరు పరిచారు. అసభ్యకరమైన మెసేజీలను పంపించిన రాజీవ్ శర్మ, హేమ్ రాజ్ కుమార్, ఆదిత్య కుమార్ లకు బెయిల్ లభించింది. బెయిల్ మీద వారు విడుదలయ్యారు. వాట్సప్ ద్వారా అశ్లీల ఫొటోను పంపిన షబ్బీర్ గుర్ఫాన్ కు న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్ కు పంపించింది. అతను మాంసపు దుకాణం నిర్వాహకుడని పోలీసులు తెలిపారు.
ఈ అరెస్టులపై బర్ఖాదత్ స్పందించారు. తనకు వేధించిన వారు నలుగురు మాత్రమే కాదని చెప్పారు. మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని చెప్పారు. మొత్తం 10 మందిపై తాను ఫిర్యాదు చేశానని అన్నారు. 10మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని గుర్తు చేశారు. త్వరలోనే వారు కూడా అరెస్టవుతారని ఆశిస్తున్నట్లు బర్ఖాదత్ చెప్పారు.