దడ పుట్టించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభకు హాజరు.. రాజీనామాకు ఇప్పటికీ రెడీ
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన నలుగురు అసంతృప్త శాసన సభ్యులు ఎట్టకేలకు మీడియా ముందుకు వచ్చారు. బుధవారం వారు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ చేపట్టిన ఆపరేషన్ కమలలో భాగంగా వారు ఆ పార్టీలో చేరిపోతారనే అనుమానాలకు తెర దించారు. తాము బీజేపీలో చేరబోవట్లేదని స్పష్టం చేశారు. సొంత పార్టీలోనే తమకు శతృవులు ఉన్నారని వెల్లడించారు. చాపకింద నీరులా తమను, పార్టీకి ద్రోహం చేయడానికి సిద్ధపడ్డారని, అలాంటి వారి వల్ల తాము ఇబ్బందులు పడుతున్నామని స్పష్టంచేశారు.
రమేష్ జార్కిహోళి (గోకాక్), నారాయణ గౌడ (కేఆర్ పేటె), ఉమేష్ జాదవ్ (బళ్లారి రూరల్), మహేష్ కుమటళ్లి (అథణి)లకు అసంతృప్త ఎమ్మెల్యేలుగా గుర్తింపు ఉంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆరంభమైనప్పటి నుంచి వారు మాయం అయ్యారు. పార్టీ నాయకులకు అందుబాటులో లేకుండా పోయారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండూరావు వారిపై క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకున్నారు. పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
సస్పెండ్ చేసిన నాలుగైదు రోజులకు గానీ వారు బయటికి రాలేదు. రమేష్ జార్కిహోళి ముంబైలో గడిపారు. బుధవారం ఉదయం ఆయన ముంబై నుంచి బెంగలూరుకు చేరుకున్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను ఆపరేషన్ కమలలో భాగం కాలేదని స్పష్టం చేశారు. సొంత పార్టీలోనే తనను కొందరు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ, పదవి కంటే కూడా తనకు ఆత్మాభిమానం ముఖ్యమని చెప్పారు. దీనికోసం తాను కాంగ్రెస్ కు రాజీనామా చేయడానికైనా వెనుకాడబోనని రమేష్ జార్కిహోళి అన్నారు. తన ఇబ్బందులన పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.
అథణి శాసనసభ్యుడు మహేష్ కుమఠళ్లి, ఉమేష్ జాదవ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. తనకు వ్యతిరేకంగా సొంత పార్టీలోనే కొందరు పావులు కదుపుతున్నారని చెప్పారు. వారి ప్రవర్తనకు విసిగిపోయానని అన్నారు. పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే తనకు పెద్ద దిక్కు అని, ఆయనకు వ్యతిరేకంగా తాను ఎప్పుడూ నోరు విప్పనని ఉమేష్ జాదవ్ చెప్పారు. తాను వ్యక్తిగత కారణాల వల్లే అసెంబ్లీ సమావేశాలకు రాలేకపోయానని మరో ఎమ్మెల్యే నారాయణ గౌడ అన్నారు. వ్యక్తిగత, వ్యాపార కారణాల వల్ల తాను ఇన్ని రోజులు ముంబైలో ఉన్నానని చెప్పారు.
అసంతృప్త ఎమ్మెల్యేల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుంటామని సీనియర్ నాయకులు, మంత్రి డీ కే శివకుమార్ చెప్పారు. పార్టీలో వారు ఎదుర్కొన్న ఇబ్బందులను పరిష్కరిస్తామని అన్నారు. వారంతా దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారని, ఏ పార్టీలోకి ఫిరాయించబోరని డీకే ధీమా వ్యక్తం చేశారు. వారిపై విధించిన సస్పెన్షన్ ఎత్తేయాలా? లేదా? అనే విషయంపై పార్టీలో చర్చించి, నిర్ణయం తీసుకుంటామని అన్నారు. నలుగురు అసంతృప్త ఎమ్మెల్యేలు సభకు హాజరు కావడం, పార్టీ నాయకత్వానికి అందుబాటులోకి రావడం.. గైర్హాజర్ కావడానికి కారణాలను వెల్లడించడం వల్ల ఇక అందరి దృష్టీ పీసీసీపై పడింది. ఆ నలుగురిపై ఇదివరకు విధించిన సస్పెన్షన్ ను ఎత్తేస్తుందా? లేక కొనసాగిస్తుందా? అనేది చర్చనీయాంశమైంది.