మరో 4 రోజులు గడిస్తే మేజర్.. ఇంతలో ఒకరి చావుకు కారణమయ్యాడు.. అయినా శిక్ష లేదు
ఢిల్లీలో 2016లో ఓ టీనేజర్ అతివేగంగా కారు నడిపి ఓ వ్యక్తి మృతికి కారణమయ్యాడు. అయితే అప్పటికి ఆ టీనేజర్ వయసు 17 ఏళ్లు మాత్రమే. మరో నాలుగు రోజులు గడిస్తే అతనికి 18 ఏళ్లు నిండేవి. తన తండ్రికి చెందిన మెర్సిడెజ్ బెంజ్ కారుతో రోడ్డు పైకి వచ్చి ఈ ప్రమాదానికి కారణమయ్యాడు. అప్పటికి నిందితుడు మైనర్ కావడంతో ట్రాఫిక్ చట్టాల కింద జరిమానా విధించడం, అతన్ని జువైనల్ హోమ్కి తరలించడం మినహా పెద్దగా శిక్ష ఏమీ పడలేదు. దీంతో బాధితుడి కుటుంబం అతనికి శిక్ష పడాలని కోర్టుల చుట్టూ తిరుగుతోంది. తాజాగా ఈ కేసు సుప్రీం కోర్టులో మరోసారి విచారణకు రాగా బెంచ్ ఆసక్తికర తీర్పు చెప్పింది.
చట్టం ప్రకారం నడుచుకోవాల్సిందేనన్న కోర్టు..
నిందితుడు మైనర్ కావడంతో ఒక్క రోజు కూడా అతనికి జైలు శిక్ష విధించే అవకాశం లేదని, జువైనల్ హోమ్ అజ్జర్వేషన్లో మాత్రమే ఉంటాడని కోర్టు స్పష్టం చేసింది. 'మేమేమీ జిగ్సా పజిల్ను సాల్వ్ చేయడం లేదు. చట్టంలో ఒక పదాన్ని జోడించడం గానీ మరో దానితో భర్తీ చేయడం గానీ మేము చేయలేము. ఒక అంశంపై రెండు వివరణలు సాధ్యమైనప్పుడు.. జువైనల్స్కి బెనిఫిట్గా ఉండే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.' అని జస్టిస్ దీపక్ మిశ్రా నేత్రుత్వంలోని బెంచ్ స్పష్టం చేసింది.
జువైనల్ చట్టం ప్రకారం..
జువైనల్ చట్టం కింద నమోదయ్యే నేరాలు ఘోరమైన నేరాల కిందకు రావని తీర్పు కాపీని చదివేటప్పుడు న్యాయమూర్తి పేర్కొన్నారు. చట్టపరమైన నిబంధనలు స్పష్టంగా ఉన్నప్పుడు.. దానికి కట్టుబడి ఉండటం తప్ప మార్చలేమని చెప్పారు.నేరానికి పాల్పడింది జువైనల్ కాదని తేలితేనే హత్య కేసుల్లో నిందితుడికి ఏడేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయమూర్తి తెలిపారు. కాగా, ఈ కేసులో బాల నేరస్తుడైన నిందితుడిపై సెక్షన్ 304 కింద కేసు నమోదు చేశారు. దీని ప్రకారం.. జరిగిన హత్య నేరపూరిత హత్య కిందకు రాదు. సెక్షన్ 304 ప్రకారం గరిష్టంగా పదేళ్ల వరకు జైలు శిక్ష పడవచ్చు. కానీ కనీస శిక్షా కాల పరిధి గురించి అందులో పేర్కొనలేదు.
హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు
ఈకేసులో బాధితుడి సోదరి సిద్దార్థ శర్మ(32) తొలుత హైకోర్టును ఆశ్రయించింది. తాను చేసిన నేరం గురించి పూర్తి అవగాహన ఉండి, దాని గురించి అర్థం చేసుకోగల అవగాహన ఉన్న అతన్ని వయోజనుడిగా భావించి శిక్షించాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే హైకోర్టు దాన్ని తోసిపుచ్చడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఆమె తరుపు న్యాయవాది సిద్దార్థ లుత్రా.. తీవ్ర హత్య నేరాల్లోనూ జువైనల్ చట్టం కింద శిక్షలు మినహాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కనీస శిక్షలు కూడా విధించకపోవడం సరికాదన్నారు. ఇప్పటికైనా జువైనల్ చట్టాల్లో మార్పులు చేయాలనడానికి తాజా కేసే మంచి ఉదాహరణ అని చెప్పారు.
చట్ట సవరణ చేసేంతవరకు అంతే..
సిద్దార్థ లుత్రా వాదనలతో సుప్రీం కోర్టు ఏకీభవించలేదు. ఇందుకోసం చట్ట సవరణ చేయాల్సి ఉంటుందని, అప్పటిదాకా వాటిని నేరపూరిత హత్య కేసులుగా పరిగణించలేమని తెలిపారు. జువైనల్ కేసుల్లో మూడు నుంచి ఏడేళ్ల వరకు జువైనల్ హోమ్లోనే ఉంచే అవకాశం ఉంటుందన్నారు. జువైనల్ చట్టాలకు పార్లమెంటులో చట్ట సవరణ జరగాలని, అంతే తప్ప తాము వాటిని కదిలించే అవకాశం లేదని స్పష్టం చేశారు.