పట్టాలపై మందు పార్టీ.. రైలు ఢీ కొని నలుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు దుర్మరణం!
చెన్నై: తమిళనాడులో విషాదకర ఘటన చోటు చేసుకుంది. రైలు ఢీకొని నలుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. బుధవారం రాత్రి కోయంబత్తూరు జిల్లాలో ఈ ఘటన సంభవించింది. రైలు ఢీ కొట్టిన సమయంలో ఈ నలుగురు విద్యార్థులు మద్యం మత్తులో ఉన్నారని పోలీసులు నిర్ధారించారు. ఎవరికీ తెలియని ప్రదేశం, చీకటి ప్రాంతం కావడం వల్ల మద్యాన్ని సేవించడానికి అనువుగా ఉంటుందనే ఉద్దేశంతో వారు రైలు పట్టాలపై మద్యం పార్టీని ఏర్పాటు చేసుకుని ఉండొచ్చని ప్రాథమికంగా ధృవీకరించినట్లు కోయంబత్తూరు సిటీ పోలీసులు తెలిపారు.
కోయంబత్తూరులోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులు డీ సిద్ధిక్ రజా, రాజశేఖర్, ఎం గౌతమ్, కురుప్పుస్వామి, ఎం విఘ్నేశ్ నగర శివార్లలోని సుళూర్ ప్రాంతంలో గల రౌతర్ పాలం రోడ్ ఓవర్ బ్రిడ్జి వద్ద పట్టాలపై మందు పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. మద్యం మత్తులో ఉన్న సమయంలో చెన్నై నుంచి కేరళలోని అళప్ఫుజకు వెళ్లే ఎక్స్ ప్రెస్ వారిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో విఘ్నేష్ మినహా మిగిలిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. విఘ్నేశ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆ సమయంలో విద్యార్థులు వేసిన కేకలను గమనించిన స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Recommended Video
సమాచారాన్ని అందుకున్న వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టమ్ కోసం కోయంబత్తూర్ ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. విఘ్నేశ్ ను ఆసుపత్రికి తరలించారు. అతనికి అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. గౌతమ్, కురుప్పుస్వామి పూర్వ విద్యార్థులు. ఓ కాంపిటీటివ్ పరీక్షను రాయడానికి కోయంబత్తూరుకు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న విఘ్నేష్, రాజశేఖర్, సిద్ధిక్ రజా వారిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా మందుపార్టీని ఏర్పాటు చేసుకున్నారని పోలీసులు తెలిపారు. విద్యార్థులంతా పాతికేళ్ల లోపు వారే కావడం దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.