భత్కల్ అనుచరుడి అరెస్ట్, దిల్సుఖ్నగర్ పేలుళ్లతో లింక్
పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ఎగుమతి చేసిన వకార్ ఒక కరుడుగట్టిన ఉగ్రవాది అని, పరారీలో ఉన్న అనుచరులతో కలిసి బీహార్లోని గయ, పాట్నా పేలుళ్లు, జవేరి బజార్ పేలుళ్లు, హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్లో జరిగిన పేలుళ్లు సహా దేశవ్యాప్తంగా అనేక దాడులకు పాల్పడ్డాడని ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం స్పెషల్ కమిషనర్ ఎస్ఎన్ శ్రీవాస్తవ ఆదివారం ఇక్కడ విలేఖరులకు చెప్పారు.
ముంబయిలోని బాంద్రా నుంచి వచ్చిన ఒక రైలులోంచి దిగిన రెహమాన్ను శనివారం తెల్లవారుజామున అజ్మీర్ రైల్వే స్టేషన్ వెలుపల అరెస్టు చేసినట్టు చెప్పారు. అతనిచ్చిన సమాచారం ఆధారంగా అనుచరులు ముగ్గురిని జైపూర్కు చెందిన మహమ్మద్ మహ్రుఫ్ (21), మహమ్మద్ వకార్ అజర్ అలియాస్ హనీఫ్ (21), జోధ్పూర్కు చెందిన షకీబ్ అన్సారీ అలియాస్ ఖాలిద్ (25)లను రాజస్థాన్ పోలీసుల సాయంతో వారి ఇళ్ల వద్ద ఆదివారం తెల్లవారుజామున అరెస్టు చేసినట్టు శ్రీవాస్తవ చెప్పారు.
అరెస్టు చేసిన ముగ్గురితో సంబంధాలు కలిగి ఉన్నట్టుగా భావిస్తున్న నగరంలోని జామియా నగర్ ప్రాంతానికి చెందిన ఒక యువకుడిని కూడా పోలీసులు ప్రశ్నించడం కోసం అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అరెస్టు చేసిన వారి ఇళ్లలోంచి భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు, డెటొనేటర్లు, ఎలక్ట్రానిక్ సర్క్యూట్లు, టైమర్లను స్వాధీనం చేసుకున్నామని, దీంతో భారీ ఉగ్రవాద దాడిని తప్పించామని చెప్పారు.
ఈ టెర్రరిస్టులు బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై దాడికి పథకం వేసుకున్నారా అని ప్రశ్నకు, ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో ఆ విషయం దిశగా ఏమీ ఆధారాలు లభించలేదని చెప్పారు. లోక్సభ ఎన్నికల సమయంలో ఎవరైనా రాజకీయ నాయకుడిపైన లేదా ర్యాలీపైన దాడి జరపడానికి పథకం వేసుకున్నారా అన్న ప్రశ్నకు, ఎన్నికలతో సహా ఏ ముఖ్యమైన కార్యక్రమంపై అయినా దాడి జరిగే అవకాశం లేకపోలేదని, అయితే దర్యాప్తు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నందున ప్రస్తుతానికి ఎలాంటి ఊహాగానాలు చేయలేనని శ్రీవాస్తవ చెప్పారు.
టెర్రరిస్టుల నుంచి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలకు సంబంధించి జైపూర్, జోధ్పూర్లో పేలుడు పదార్థాల చట్టం కింద కేసులు నమోదు చేసినట్టు ఆయన చెప్పారు. కాగా, కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే నలుగురు ఇండియన్ ముజాహిదీన్ టెర్రరిస్టులను అరెస్టు చేయడాన్ని ప్రశంసిస్తూ రెహమాన్ అరెస్టు గొప్ప విజయమన్నారు. ఇతర టెర్రరిస్టులను పట్టుకోవడానికి ఇది ఎంతో తోడ్పడుతుందని అన్నారు. దిల్ సుఖ్ నగర్ పేలుళ్లలో వకార్కు సంబంధముంది. హద్దీ, మరో ఉగ్రవాది తహసీన్తో కలిసి ఫిబ్రవరి 21న దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు.