అంతలోనే: ఆ విమాన ప్రమాదంలో ఏపీ డాక్టర్ మనీషా, మరో ముగ్గురు ఇండియన్స్ సహా 157 మంది మృతి
ఆడిస్ అబాబా: ఇథియోపియాలో ఆదివారం 157 మందితో కుప్పకూలిన విమానంలో ప్రయాణీకులు, కేబిన్ క్రూ అందరూ మృతి చెందారు. ఇందులో 149 మంది ప్రయాణీకులు, ఏడుగురుసిబ్బంది ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ విమాన ప్రమాదంలో మృతి చెందినవారిలో 4గురు భారతీయులు ఉన్నారు. ఇందులో ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన యువ డాక్టర్ మనీషా ఉన్నారు.
ఇథియోపియాలో ఘోర విమాన ప్రమాదం, బోయింగ్ 737లో సిబ్బంది సహా 157 మంది
మనీషా యువ డాక్టర్.. ప్రమాదంలో మృతి
ఏపీలోని అమరావతి మండలం ఉంగుటూరు గ్రామానికి చెందిన నూకవరపు మనీషా యువ డాక్టర్. ఈ ప్రమాదంలో ఈమె కూడా దుర్మరణం చెందారు. ఉంగుటూరుకు చెందిన నూకవరపు వెంకటేశ్వర రావు, భారతి దంపతుల రెండో కూతురు మనీషా. గుంటూరు మెడికల్ కాలేజీలో నాలుగేళ్ల క్రితం ఆమె వైద్య విద్యను అభ్యసించారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. మనీషా అక్క లావణ్య నైరోబీలో ఉంటున్నారు. పదిరోజుల క్రితం లావణ్య ఒకే కాన్పులో ముగ్గురు మగపిల్లలకు జన్మనిచ్చారు. వారిని చూసేందుకు మనీషా అదే విమానంలో బయలుదేరారు.
ఇథియోపియా నుంచి నైరోబీ వెళ్తుండగా..
అమెరికా నుంచి ఇథియోపియాకు వెళ్లారు. అక్కడి నుంచి నైరోబీ పయనం అయ్యారు. కానీ అంతలోనే ప్రమాదంలో చనిపోయారు. మనీషా పేరెంట్స్ గుంటూరు నగరంలోని నవభారత్నగర్లో ఉంటున్నారు. కూతురు మృతితో కన్నీటి పర్యంతమయ్యారు. మనీషా తల్లిదండ్రులు నెలరోజులుగా పెద్ద కూతురు వద్ద ఉంటున్నారు. మనీషాతో పాటు మన దేశానికి చెందిన పన్నగేశ్ భాస్కర్, వైద్య హన్సిన్ అన్నగేశ్, పర్యావరణ కన్సల్టెంట్ శిఖా గార్గ్లు కూడా మృతి చెందారు. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ట్వీట్ చేశారు.
వెనక్కి వచ్చేద్దామనుకున్నారు కానీ అంతలోనే
కాగా, ప్రభుత్వరంగ సంస్థ ఇథియోపియన్ ఎయిర్ లైన్స్(ఈఏ)కు చెందిన బోయింగ్ 737-8 మాక్స్ విమానం అడిస్ అబాబాలోని బోలె అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఉదయం ఎనిమిదిన్నర గంటలకు బయలుదేరింది. కెన్యా రాజధాని నైరోబీకి అది వెళ్లాలి. ఆ తర్వాత ఆరేడు నిమిషాల్లోపు రాడార్తో దాని సంబంధాలు తెగిపోయాయి. అడిస్ అబాబాకు దక్షిణాన సుమారు 50 కి.మీ. దూరంలో బిషోఫ్తు పట్టణ సమీపంలోని హెజెరె ప్రాంతంలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమానంలోని వారంతా మృతి చెందినట్లు ఈఏ, ఇథియోపియన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్(ఈబీసీ) తెలిపింది. విమానం టేకాఫ్ అయిన కాసేపటికి తాము ఆపదలో ఉన్నామని, వెనక్కి రావాలనుకుంటున్నామని పైలట్ నుంచి మెసేజ్ వచ్చిందని, వెనక్కి వచ్చేందుకు తాము అనుమతి ఇచ్చామని, అంతలోనే దుర్ఘటన చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. ఈ ఎయిర్ లైన్స్కు ఆఫ్రికాలోనే ఉత్తమ విమానయాన సేవలు అందించే సంస్థగా పేరు ఉంది. ప్రమాదానికి గురైన విమానం కొత్తది. గత ఏడాది నవంబర్ లోనే అది ఈఏ చేతికి అందింది. గత ఏడాది అక్టోబర్లో బోయింగ్ 737-8 మాక్స్ తరగతికే చెందిన విమానం ఒకటి ఇండేనేసియా రాజధాని జకర్తా నుంచి బయలుదేరిన కాసేపటికే జావా సముద్రంలో కూలింది. అప్పుడు 189 మంది చనిపోయారు.